సిబిఐ దాడులు కుట్రే: వైయస్ జగన్ వర్గం దాడి
జగన్ పైన కక్ష సాధింపు చర్యల ద్వారా కాంగ్రెసుకు గడ్డుకాలం వచ్చిందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు అన్నారు. సాధారణ చిన్న చిన్న టవల్స్ వంటి వస్తువులను సైతం లెక్కించడం ఎంత వరకు సమంజసం అన్నారు. దాడులు చేసినందుకు రాష్ట్రంలో కాంగ్రెసు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. జగన్ ఆస్తులపై మాత్రమే కాకుండా నాటి మంత్రివర్గం పైనా విచారణ చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రులంతా స్వచ్చందంగా సిబిఐ విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. నాటి మంత్రివర్గంలో ఉన్నందుకు తాను సైతం విచారణకు సిద్ధమని అన్నారు. కేంద్రం అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నాహజారేను జైల్లో పెట్టిన కేంద్రం జగన్ను వదులుతుందని తాము అనుకోవడం లేదని మరో నేత గట్టు రామచంద్రారావు అనుమానం వ్యక్తం చేశారు. శంకర్ రావు కక్షతోనే కోర్టుకు లేఖ రాశారన్నారు. కోర్టు తీర్పును తాము తప్పుపట్టడం లేదన ిఅయితే కోర్టుకు వెళ్లిన తీరును మాత్రమే తప్పుపడుతున్నట్టు చెప్పారు.
సుప్రీం కోర్టు స్టే ఇస్తుందనే ఉద్దేశ్యంతోనే హడావుడిగా దాడులు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఆరోపించారు. జగన్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న శోభానాగిరెడ్డి హుటాహుటినా జగన్ నివాసానికి చేరుకున్నారు. తమ నిజాయితీ నిరూపించుకునేందుకే సుప్రీంకు వెళ్లామని అన్నారు. వ్యక్తగత కక్షల కోసం కేంద్రం సిబిఐని వినియోగించుకుంటుందని ఆరోపించారు. బాత్ రూంలో సైతం సోదాలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం అన్నారు. కాంగ్రెసుకు ప్రజలు త్వరలో బుద్ది చెప్పే రోజు వస్తుందన్నారు. జగన్ ఆస్తులపై సోదాల కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. టిడిపి, కాంగ్రెసులు రాజకీయంగా జగన్ను ఎదుర్కొనలేక కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని అన్నారు. వైయస్ హయాంలోని మంత్రులకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ ఎన్నికలకు రావాలని ఎమ్మెల్యే కొండా సురేఖ సవాల్ విసిరారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ పైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్న కాంగ్రెసు మట్టికొట్టుకు పోవడం ఖాయమన్నారు.