గాలి కేసు: ఇరుకున పడిన సబితా ఇంద్రారెడ్డి
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం - గాలి జనార్దన్ రెడ్డికి గనులు లీజుకు ఇస్తూ జారీ చేసిన జీవోపై ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి సంతకంతో పాటు సబితా ఇంద్రారెడ్డి సంతకం కూడా ఉంది. ఆ జీవోల నుంచి క్యాప్టివ్ మైనింగ్ అనే పదం మాయం కావడం వల్లనే శ్రీలక్ష్మి కేసులో ఇరుక్కున్నారనే అభిప్రాయం దృఢంగా ఉంది. బ్రాహ్మణి స్టీల్స్కు క్యాప్టివ్ మైన్స్ కింద ఇవ్వాల్సిన లీజును దాన్ని ఎగరగొట్టేసి అప్పనంగా గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టారనేది ప్రధాన ఆరోపణ. దాంతో సబితా ఇంద్రారెడ్డి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు నుంచి తప్పించుకునే అవకాశాలు లేవని అంటున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ అధికారులు ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ప్రశ్నించారు. కేసులో ఆమెను ఓ సాక్షిగా మాత్రమే సిబిఐ అధికారులు ప్రశ్నించారని ఇప్పటి వరకు అనుకుంటూ వస్తున్నారు. మరోసారి సిబిఐ అధికారులు ఆమెను ప్రశ్నించి, నిందితురాలిగా చేరుస్తారా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శ్రీలక్ష్మి రిమాండ్ రిపోర్టులో సిబిఐ స్పష్టంగా సబితా ఇంద్రారెడ్డి పేరును ప్రస్తావించడాన్ని ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ప్రధానంగా ప్రస్తావించింది. కాగా, ఈ కేసులో సిబిఐ డిసెంబర్ 3వ తేదీలోగా చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. శ్రీలక్ష్మిని మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్న సిబిఐ ఆమె చెప్పే సమాచారంపై ఆధారపడి సబితా ఇంద్రారెడ్డి విషయంలో ముందుకు సాగుతారా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.