కిరణ్, నరసింహన్ మధ్య భగ్గుమంటున్న విభేదాలు

ఎనిమిది సమాచార కమిషనర్లలో నలుగురికి ఆమోదం తెలుపుతూ మరో నలుగురి నియమాకాన్ని గవర్నర్ తోసి పుచ్చారు. మిగతా నలుగురు కాంగ్రెసు పార్టీకి చెందినవారని అంటున్నారు. నలుగురి నియామకం నిబంధనలకు విరుద్దంగా ఉందని గవర్నర్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి తన పట్టును వీడడం లేదు.
తాను నియమించిన ఎనిమిది మందికి ఆమోదం తెలపాల్సిందేనని కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఇరువురి మధ్య పొరపొచ్చాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచార కమిషనర్ల నియామకంపై మీడియాలో కూడా విమర్శలు వచ్చాయి. నలుగురి పేర్లు తీసేయకుండా తనకు పంపితే మళ్లీ తిరస్కరిస్తానని గవర్నర్ అంటున్నట్లు తెలుస్తోంది.
ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నరసింహన్ పదవీ కాలాన్ని పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం ఊపు మీద ఉన్న స్థితిలో ఆయనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం తెచ్చి పెట్టింది. ఆయన పదవీ కాలం జనవరి 24వ తేదీన ముగిసినప్పటికీ ఇంకా కొనసాగుతున్నారు. నరసింహన్ ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలిశారు.
తనకు కర్ణాటక లేదా మహారాష్ట్రలకు గవర్నర్గా అవకాశం ఇవ్వాలని నరసింహన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కోరినట్లు తెలిసింది. అయితే, నరసింహన్ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్గానే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ రాజకీయాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో గవర్నర్ పాత్ర చాలా ఉన్నందున ఆయననే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
పైగా, రాష్ట్రంలో 18 శాసనసభ స్థానాలకు, లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత గవర్నర్ పాత్ర కీలకంగా మారుతుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులను, ఉప ఎన్నికల తర్వాత మారే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నరసింహన్ను కొనసాగించడం అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర పరిస్థితులు చక్కబడే వరకు ఆయన ఉంటారని అంటున్నారు.
రాష్ట్రంలో గవర్నర్ నరసింహన్ పాత్రను ఇతర పార్టీల తెలంగాణ నాయకులే కాకుండా అధికార కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా తప్పు పడుతున్నారు. నరసింహన్పై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు పలుమార్లు బహిరంగ విమర్శలు చేయడమే కాకుండా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా నరసింహన్ కేంద్రానికి నివేదికలు ఇస్తున్నారని తెలంగాణ ప్రాంత నాయకులందరూ అంటున్నారు. అయితే, తాను తెలంగాణపై ఏ విధమైన నివేదికలు ఇవ్వడం లేదని ఆయన పదే పదే చెబుతున్నారు. కానీ, రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వమే కాకుండా కాంగ్రెసు అధిష్టానం కూడా నరసింహన్ మీదనే ఆధారపడినట్లు గట్టిగా నమ్ముతున్నారు.


Click it and Unblock the Notifications