భాను కిరణ్తో వైయస్ బంధువుల దందాపై సిఐడి ఆరా
భానుతో ఉన్న బంధం పైనా, ఇరువురు కలిసి చేసిన సెటిల్మెంట్ల పైనా సిఐడి మల్లికార్జున్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తమ కస్టడీలో భాను వెల్లడించిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో మల్లికార్జున రెడ్డి పేరుతో రిజిస్టర్ అయిన 15ఎకరాల భూమిని సిఐడి అధికారులు గుర్తించారు. దీనిపై సోమవారం ఉదయం నుంచి మల్లికార్జున రెడ్డిని రహస్యంగా విచారించారని తెలుస్తోంది.
దీంతో ఆయన అనుచరులు సిఐడి కార్యాలయ పరిసరాల్లో ఆందోళనగా కనిపించారు. సిటీస్క్వేర్ రియల్ ఎస్టేట్స్ యజమానులు దినేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి (జగన్ బావమరిది, మామ)తో కలిసి భాను వేసిన ఫ్రంట్లైన్ ప్రాజెక్టు గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఈ వెంచర్ కోసం రైతుల నుంచి భూమలు సేకరించి వారికి ఇంకా డబ్బులు చెల్లించలేదని, అందులో కొంత భూమిని విక్రయించారని వచ్చిన ఫిర్యాదులపై సిఐడి దర్యాప్తు చేస్తోంది.
భాను భూదందాల వెనుక ఉన్న వారందరినీ బయటకు లాగే పనిలో పడింది. కడప జిల్లాలోని కమలాపురం, సింహాద్రిపురం, పులివెందుల ప్రాంతాలకు చెందిన మరికొందరిని సిఐడి అధికారులు పిలిపించే అవకాశాలున్నట్లు తెలిసింది. కాగా, సూరి హత్య సమయంలో కారు డ్రైవర్గా ఉన్న మధుమోహన్ రెడ్డిని సిఐడి అధికారులు సోమవారం విచారించారు. సుమారు గంటన్నరపాటు అతడిని ప్రశ్నించారు.