నెల్లూరుకు క్యూ కట్టిన కిరణ్, చిరు సహా ఎపి నేతలు
దర్యాప్తు పూర్తయిన తర్వాత సంఘటనకు బాధ్యులెవరో తేలుస్తామని ముఖ్యమంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా రైల్వే భద్రతపై సమీక్ష జరగాల్సి ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. రాష్ట్రంలో తరుచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని, రైలు ప్రమాదాలను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించి వాటిని నివారించేందుకు ఏర్పాటైన కమిటీలన్నీ నామమాత్రంగానే ఉండిపోయాయని ఆయన అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రకటించే ఆర్థిక సహాయాన్ని పెంచాలని ఆయన కోరారు. బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కూడా సంఘటనా స్థలానికి బయలుదేరారు. తిరుపతి పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారు జామున జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన రైల్వే మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సహాయ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకారం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సహాయ చర్యలను వేగవంతం చేసి బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు.
నెల్లూరులో జరిగిన తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ముఖుల్రాయ్ ఆదేశించారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి లక్ష , స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారాన్ని ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమిషనర్ డీకె సింగ్ విచారణ జరిపి ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోనున్నారు.