తెలంగాణపై షిండే: నాగం ఫైర్, డోంట్ కేర్.. కోదండరామ్
తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నక్సలిజానికి ముడిపెట్ట వద్దని నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సీమాంధ్ర నేతల ప్రభావంతో తెలంగాణకు వ్యతిరేకంగా నక్సలిజం అంటూ మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజా ఉద్యమానికి నక్సలిజంతో ముడి పెట్టవద్దని ఆయన కోరారు. తెలంగాణ తప్ప తాము మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే ప్రసక్తి లేదన్నారు.
కేంద్ర హోంమంత్రి షిండే తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు విధాన ప్రకటన కాదని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోదండరామ్ వేరుగా అన్నారు. బలమైన శక్తులు తెలంగాణను అడ్డుకుంటున్నాయని, పెద్ద స్థాయిలో ఒత్తిడి తేవాలని, అదే పనిలో తాము ఉన్నామని చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
రెండు మూడు రోజుల్లో గవర్నర్ నరసింహన్ను కలిసి తెలంగాణ మార్చ్ పైన సమాచారం ఇస్తామని కోదండరామ్ తెలియజేశారు. తెలంగాణ మార్చ్ కార్యాచరణపై తాము అస్పష్టంగా లేమని చెప్పారు. త్వరలోనే తుది రూపు ఇస్తామని చెప్పారు. అన్ని ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను కలిసి, తెలంగాణ మార్చ్లో పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.