జగన్ కంపెనీల్లో రూ.850 కోట్ల పెట్టుబడులు: సిబిఐ
గురువారం వాదనల సమయంలో.. వాన్పిక్ ప్రాజెక్ట్స్కు సంబంధించి ప్రసాద్పై దాఖలు చేసిన కేసు జగన్ ఆస్తుల కేసులో భాగమేనా అని న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు ప్రశ్నించగా, కాదని సిబిఐ న్యాయవాది చెప్పారు. కేసుకు సంబంధించిన వాదనలు కూడా ఆసక్తికరంగా కొనసాగాయి. సిబిఐ విచారణ తీరుపై న్యాయమూర్తి శరపరంపరగా సంధించిన ప్రశ్నలకు కేశవరావు సరైన సమాధానాలివ్వలేకపోయారు.
దాంతో, కోర్టుకున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంటుందని, అడిగిన ప్రతి ప్రశ్నకూ బదులివ్వాలని అంటూ సిబిఐ న్యాయవాదిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాన్పిక్ ఒప్పందాలకు సంబంధించి చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పేందుకు ఆయన ప్రయత్నించడంతో, కోర్టు సమయాన్ని వృథా చేయరాదని స్పష్టంగా చెప్పారు. సిబిఐ వాదనలపై నిమ్మగడ్డ తరఫు న్యాయవాదులు వివరణ ఇచ్చేందుకు వీలుగా తదుపరి వాదనల నిమిత్తం విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఇందూ గ్రూప్ నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా కోట్లాది రూపాయల పెట్టుబడులు జగన్ కంపెనీలలో పెట్టాయన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిమ్మగడ్డ రూ.850 కోట్లు జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలన్నారు. నిమ్మగడ్డ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... సాక్ష్యుల్లో వాన్పిక్కు చెందిన ఉద్యోగులు 10 మందే సాక్షులుగా ఉన్నారని, వారి వాంగ్మూలాలను గత మార్చిలోనే సిబిఐ నమోదు చేయించిందన్నారు.
సాక్షుల్లో ప్రభుత్వోద్యోగులే ఎక్కువ మంది ఉన్నారని, ఒప్పందాలకు సంబంధించిన అన్ని రికార్డులను సిబిఐ ఇప్పటికే చార్జిషీట్తోపాటు కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ఆధారాలను మాయం చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని, సాక్షులను ప్రభావితం చేస్తారనేందుకు సిబిఐ చిన్న ఆధారాన్ని కూడా చూపలేకపోతోందని, కేవలం యాంత్రికంగా మాత్రమే అభ్యంతరం తెలుపుతోందని, వాన్పిక్ ప్రాజెక్టులో ప్రభుత్వానికి పైసా పెట్టుబడి లేదన్నారు. రాయితీ ఒప్పందంపైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ అభ్యంతరం లేదన్నారు.
రూ.17 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టులో వాన్పిక్ ఇప్పటికే కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టిందని, సిబిఐ కేసుతో ప్రాజెక్టు అభివృద్ధి ఆగిపోయిందన్నారు. లీజుకిచ్చిన ప్రాంతంలో విద్యుత్ కంపెనీలు ప్రారంభమై ఉంటే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండేది కాదన్నారు. ప్రస్తుతం రూ.11కు కొనుగోలు చేస్తున్న కరెంటు రూ.3కే వచ్చేదన్నారు.