జగన్ పార్టీకి చిరంజీవి చురకలు: జర్నలిస్టుల నిరసన
కొందరు కావాలనే కాంగ్రెసు పార్టీ పైన, తమ పైన దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెసు పార్టీ ఓ వట వృక్షం అన్నారు. కొందరు పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని, కానీ కాంగ్రెసు వేళ్లూ బలంగా ఉన్నాయన్నారు. కొన్ని పార్టీలకు వేళ్లు లేవని, కానీ ఇప్పుడు పచ్చగానే కనిపిస్తుందని, కాని వేళ్లు లేని కారణంగా అది ముందు ముందు అలా ఉండదని జగన్ పార్టీని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెసు కోసం తామందరం కొమ్మలుగా నిలబడతామన్నారు.
రాజకీయాల్లోకి యువరక్తం అవసరమన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమని చిరంజీవి చెప్పారు. అధికారం కోసం కాంగ్రెసు ఎప్పుడూ ఆలోచించదని, ప్రజల కోసమే ఆలోచిస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రాంతీయ పార్టీలకు అతీతంగా కాంగ్రెసును బలోపేతం చేయాలని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. అధికారం అనుభవించిన తమ పైనే పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉందని ధర్మాన చెప్పారు.
కార్యకర్తలే మన పేపర్, న్యూస్ ఛానల్
పార్టీ కార్యకర్తలే కాంగ్రెసుకు పేపర్, న్యూస్ ఛానల్ అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలను గౌరవించాల్సిన బాధ్యత నేతలదే అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కనీసం యాభై మందికి సభ్యత్వం ఇస్తామన్నారు. మండల, జిల్లా స్థాయి సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. సభ్యత్వ నమోదు అనేది ఓ పవిత్ర కార్యక్రమం అన్నారు. పార్టీలో ప్రతి మండలంలో పదిమందికి పార్టీ సిద్ధాంతాలపై శిక్షణ ఇవ్వాలన్నారు.
జర్నలిస్టుల నిరసన
రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యక్రమానికి తమకు అనుమతించక పోవడం విషయంపై తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. బొత్స వారిని సముదాయించారు. ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుందని, కానీ దానికి ఓ పద్ధతి ఉంటుందన్నారు. ఇది పార్టీ కార్యక్రమమని చెప్పారు.