ఇసుకతో శిల్పాలు చెక్కుతాడు, అభిరుచీ ఆదరువూ
శ్రీకాకుళం: అతను కళకు సామాజిక ప్రయోజనాన్ని అద్ది సమాజానికి అందిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరుసుపేటకు చెందిన తరణీ ప్రసాద్ మిశ్రో సైకత శిల్పాలనే తన జీవితంగా ఎంచుకున్నాడు. సైకత శిల్పాలకు మనదేశంలో బహుళ ప్రాచుర్యం తెచ్చిపెట్టింది సుదర్శన్ పట్నాయక్. తరణీమిశ్రో ఆయనను స్ఫూర్తిగా తీసుకుని, సమాజ జాగృతికి, సమస్యలపై అవగాహనకు కృషి చేస్తున్నాడు. పెద్దపెద్ద చదువులు చదవకపోయినా సమాజాన్ని బాగా పరిశీలించాక తనకున్న పరిధిలో తనచుట్టూ ఉన్న పరిసరాలను కనీసం బాగు చేయాలన్న తపనతో తనకు నచ్చిన కళను ఆయుధంగా ఎంచుకున్నాడు. తాను ఎంచుకున్న మార్గాన్నే జీవనోపాధికి వాడుకుంటున్నాడు. సామాజిక ప్రయోజనంతో పాటు జీవనోపాధి ప్రయోజనం కూడా నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంటుందంటాడు తరణీ ప్రసాద్ మిశ్రో. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరుసుపేటకు చెందిన తరణీమిశ్రో శ్రీకాకుళం జిల్లావాసిగా ఉత్తరాంధ్ర ప్రజలకు చిరపరిచితులు.
అప్పటికే చిత్రలేఖనంలో తరణీమిశ్రోకు ప్రవేశం ఉంది. దాంతో సైకత శిల్పాలను తయారు చేసే పనికి ఉపక్రమించారు. అందుకు లక్ష్మీనరుసుపేటలోని వంశధార నదీ తీరాన్ని తన అభ్యాసానికి వేదికగా మలుచుకున్నాడు. ఇలా కొన్నేళ్ల పాటు ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనకు తానే గురువుగా భావించుకుని తన ఊహలకు, ఆలోచనలకు రూపాలను ఇచ్చేవాడు. అలా కొన్నేళ్ల పాటు తనకు తానే చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ చివరకు సంతృప్తి కలిగే వరకు సైకత శిల్పాలను రూపొందించేవారు. దాదాపు అయిదేళ్ల కృషికి ఇప్పటికి సరైన ఫలితం దక్కిందంటారు మిశ్రో.
ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో తరణీమిశ్రో అన్నా ఆయన రూపొందించే సైకత శిల్పాలన్నా తెలియని వారుండరు. ఏటా జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చే పండుగలు, పర్వదినాలు, దినోత్సవాల సందర్భంగా ఆ మరుసటి రోజే వంశధార నదీ తీరంలో ఒక చక్కటి సైకత శిల్పం ప్రజలు చూడాల్సిందే. 2013కు స్వాగతం చెబుతూ ఆయన సైకత శిల్పాన్ని రూపుదిద్దాడు. రిపబ్లిక్ డే, ఉగాది, మహిళా దినోత్సవం, సంక్రాంతి, దసరా, దీపావళి, అక్షరాస్యతా దినోత్సవం, ఆగస్టు పదిహేను, కొత్త సంవత్సరాది వేడుకలు ఇలా ఏ సందర్భం వచ్చినా వెంటనే తరణీమిశ్రో స్పందించి తన సందేశాన్ని సైకత శిల్పం ద్వారా ప్రజలకు వివరిస్తారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ ఇటీవల సాధించిన 200 పరుగుల నాటౌట్ రికార్డును తరణీమిశ్రో సైకత శిల్పం ద్వారా ప్రజలకు తెలియజేసిన విధానం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. మహిళా దినోత్సవం సందర్భం గా ఆయన రూపొందించిన సైకత శిల్పం అందర్నీ ఎంతగానో ఆలోచింపజేసింది. అక్షరాస్యత ఉద్యమం, వయోజన విద్య, సంక్షేమ పథకాలు, బహుళార్థక ప్రాజెక్టులు, మహాత్మ గాంధీ, బొజ్జ వినాయకుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, పూరీ జగన్నాథుడు, వందేమాతరం, శివపార్వతులు ఇలా తరణీమిశ్రో రూపొందించిన సైకత శిల్పాలు వంశధార నదీ తీరానికి వచ్చే సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటాయి. రథ సప్తమి, డోలోత్సవం, సంక్రాంతి, దసరా, దీపావళి పర్వదినాల్లో ఆయన తయారు చేసే సైకత శిల్పాలను చూసేందుకు శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు.
ఏళ్ల తరబడి స్వయం శక్తితో నేర్చుకున్న సైకత శిల్పాల తయారీ చివరకు ఇప్పుడు తనకు జీవనోపాధిగా మారిందని తరణీమిశ్రో చెప్తారు. వాస్తవానికి తాను చిత్రలేఖనం ద్వారా ఇన్నాళ్లూ బతుకు బండిని లాగించేవాడినని, ఆసక్తితో నేర్చుకున్న సైకత శిల్పాల రూపకల్పన ఇప్పుడు జీవనోపాధిగా మారిందంటారు. రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాల్లో వివాహాలు, ఇతర శుభ కార్యాలకు పరిచయస్థులు పిలిచి మరీ తనను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి సందర్భానికి తగ్గట్టుగా అక్కడికక్కడే సైకత శిల్పాలను తయారు చేయించుకుంటారని, దీనివల్ల తనకు ఆర్థికంగాను, వ్యక్తిగతంగాను గుర్తింపు లభిస్తోందంటారు.