వలలో జగన్, బాబు: బైరెడ్డి, హైదరాబాద్పై బాబుకు లేఖ
రెండో రాజధానిగా హైదరాబాద్
విభజన అనివార్యమైతే ఎపి రాజధాని హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలని తెలుగుదేశం పార్టీ నేత సుధీష్ రాంభొట్ల అన్నారు. హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడో సూచించారని, ఆ ప్రతిపాదనపై చర్చించాలన్నారు. అంబేద్కర్ సూచనను పరిగణలోకి తీసుకుంటే బావుంటుందన్నారు. అలాగే కేంద్రపాలిత ప్రాంత సూచనను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఈ అంశంపై పార్టీలో చర్చించాలని ఆయన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అయితే అంతిమంగా తాను పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని చెప్పారు. విభజన విషయంలో హైదరాబాదీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. లేదంటే గ్రేటర్లో తమ పార్టీకి కూడా 2009లో ఫలితాలు పునరావృతమవుతాయన్నారు.
మా నాయకులకు కనువిప్పు కలగాలి
సమైక్యాంధ్ర కోసం హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేసుకున్న తమ ప్రాంత నేతలకు కనువిప్పు కలిగే విధంగా దీవించాలని జై ఆంధ్ర నేతలు గురువారం బెజవాడ దుర్గమ్మకు మొక్కుకున్నారు. వారు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు తమ ప్రాంత నేతలు అడ్డుపడుతున్నారని, వారిలో కనివిప్పు రావాలని తాము అమ్మవారికి మొక్కామన్నారు.
సమైక్యాంధ్ర సభలు ఎక్కడ పెట్టినా తాము అడ్డుకుంటామన్నారు. విభజన జరగాల్సిందే అన్నారు. విజయవాడ రాజధానిగా రాష్ట్ర విభజన జరగాలన్నారు. ఆంధ్రా కోసం లక్ష కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న విజయవాడలో నిరసన దీక్షలు చేపడతామన్నారు.