ఆ ఇద్దరితో చిరంజీవికి తలనొప్పి: సిఎం ఫిర్యాదు
గంటా శ్రీనివాస రావుకు, సి. రామచంద్రయ్యకు పట్టుబట్టి చిరంజీవి రాష్ట్ర మంత్రి పదవులు ఇప్పించారు. కడప జిల్లా కాంగ్రెసు నేతలు వ్యతిరేకించినా చిరంజీవి మాటను కాదనలేక రామచంద్రయ్యకు ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే, వారిద్దరు కూడా కాంగ్రెసు పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తుండడం సమస్యగా మారింది. తెలంగాణ విషయంలో గంటా శ్రీనివాస రావు దూకుడుగా వ్యవహరించడం చిరంజీవికి నచ్చడం లేదని అంటున్నారు.
తెలంగాణ అంశంపై తాను కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. చిరంజీవి అలా చెప్పిన విషయం తెలిసి కూడా గంటా శ్రీనివాసరావు సమైక్యవాదాన్ని అందరికన్నా ముందుగా వినిపించారు. చిరంజీవి వైఖరికి తాము కట్టుబడి ఉంటామని గంటా శ్రీనివాసరావు చెప్పకపోవడంలోని ఆంతర్యమేమిటనే విషయంపై ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో సమైక్య సదస్సు నిర్వహిస్తామని, తెలంగాణ ఇస్తే రాజీనామాలు చేస్తామని గంటా మిగతా సీమాంధ్ర కాంగ్రెసు నాయకులకన్నా ముందుండి ప్రకటనలు చేయడం చిరంజీవికి నచ్చడం లేదని అంటున్నారు.
అలాగే, రామచంద్రయ్య ముఖ్యమంత్రి నిర్ణయాలను తప్పుపడుతూ లేఖలు రాయడం వివాదంగా మారుతోంది. ఏదైనా విషయం ఉంటే నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడడానికి గానీ చిరంజీవితో చెప్పడానికి గానీ అవకాశం ఉంది. అయితే, రామచంద్రయ్య బహిరంగ లేఖలు రాయడం అనుమానాలకు తావు ఇస్తోందని అంటున్నారు. ఇటీవల చిరంజీవి ముఖ్యమంత్రితో భేటీ అయినప్పుడు ఈ ఇద్దరు మంత్రుల వ్యవహారశైలి చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. వారు అలా వ్యవహరించడం వెనక ఇతరేతర శక్తులు ఏవైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వారి మధ్య వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులపై చిరంజీవి అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.