ఆజాద్ అవమానించారు: కోమటిరెడ్డి, కెవిపి ఇంటిముట్టడి
తెలంగాణపై ఆజాద్ ప్రకటన సరికాదన్నారు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణలో పార్టీ విశ్వాసం కోల్పోతోందన్నారు. తెలంగాణకు అనుకూలంగా వెంటనే స్పష్టమైన ప్రకటన చేసి కాంగ్రెసు పార్టీ తన చిత్తశుద్ధిని, ఇచ్చిన మాటను నిలుపుకోవాలని సూచించారు. మంత్రులు తెలంగాణ ప్రకటన లేకుండా అడుగుపెడితే అడ్డుకుంటామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హెచ్చరించారు.
రాహుల్ లొంగిపోయారు
తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. సీమాంధ్ర నేతల ఒత్తిడికి ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లొంగిపోయారని మరో ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ఇంటిని ముట్టడించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రయత్నం చేశారు. ఓ దశలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ జిల్లాలో టిజివిపి(తెలంగాణ విద్యార్థి పరిషత్) విద్యార్థులు కాంగ్రెసు పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హన్మకొండలోని కాంగ్రెసు పార్టీ భవనంను ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కాంగ్రెసు నేతల ఫ్లెక్సీలను చించివేశారు.