జగన్తో సీమాంధ్ర నేతలకు లింక్: తెలంగాణ నేతల ట్విస్ట్
సమైక్యవాదాన్ని వినిపిస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు నాయకులపై తెలంగాణ నాయకులు రెండు విధాల ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కటి - సమైక్యంగా ఉంచితే ఎన్ని సీట్లను పార్టీకి గెలిపిస్తారో చెప్పాలనేది. రెండోది - సీమాంధ్ర నాయకులు పలువురు వైయస్ జగన్ వైపు చూస్తున్నారనేది. తెలంగాణ ఇస్తే తాము తెలంగాణలో 16 దాకా లోకసభ స్థానాలను గెలిపించి ఇస్తామని, తెలంగాణ ఇవ్వకపోతే పార్టీకి ఒక్క సీటు రావడం కూడా కష్టమేనని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో వైయస్ జగన్వైపు వెళ్లేవారు పార్టీని దెబ్బ తీయడానికి సమైక్యవాదం వినిపిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
తెలంగాణను సీమాంధ్ర నాయకులు అడ్డుకుంటున్నారని కాంగ్రెసు తెలంగాణ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అంటూ సమైక్యవాదం వినిపిస్తున్న నాయకులు కాంగ్రెసులో ఉన్నారని, వారి కుమారులు మాత్రం జగన్ పార్టీలో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వారు కాంగ్రెసు పార్టీని ఎలా గెలిపిస్తారని అన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి మరో రూపంలో చెప్పారు. సమైక్యవాదం ముసుగులో కొంత మంది తమ పార్టీ నాయకులు వివిధ పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయంపై మీడియా కథనాలు రాయాలని ఆయన అన్నారు. ఈ మాటలు అంటూ ఎన్నడూ నవ్వని జానా రెడ్డి ఓ నవ్వు విసిరేశారు.
వైయస్ జగన్ ప్రాబల్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తమకు రాజకీయంగా ప్రయోజనం కలిగే విధంగా రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతోంది. ఈ స్థితిలో తెలంగాణ నేతల వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు, సీమాంధ్ర నాయకులకు నాయకత్వం వహిస్తున్న కెవిపి రామచందర్ రావు పార్టీ విధేయతను కూడా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వంటి నేతలు ప్రశ్నిస్తున్నారు.
సమైక్యవాదులకు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు స్థానంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు నాయకత్వం వహిస్తున్నారు. వైయస్ జగన్ కోసమే కెవిపి రామచందర్ రావు సమైక్యవాదానికి మద్దతుగా నిలబడి తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయడానికి కెవిపి తెలంగాణను అడ్డుకోవడానకి ప్రయత్నిస్సతున్నారని యాష్కీ విమర్సించారు.
నిజానికి, చాలా మంది కాంగ్రెసు నాయకుల పిల్లలు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. సీమాంధ్ర నాయకుల పిల్లలు మాత్రమే కాకుండా కొంత మంది తెలంగాణ నాయకుల పిల్లలు కూడా వైయస్సార్ కాంగ్రెసులో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే, జగన్ ప్రభావం ఈ ప్రాంతంలో తగ్గుతుందని, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేసుకోవడం కలిసి వస్తుందని తెలంగాణ కాంగ్రెసు నాయకులు అంటున్నారు.