నువ్వా-నేనా: ఎపి, టిఎన్జీవో మధ్య ముదిరిన విభేదాలు
టిఎన్జీవోపై ఎపిఎన్జీవో మండిపాటు
టిఎన్జీవోల పై ఎపిఎన్జీవో అధ్యక్షుడు గోపాల్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. తాము ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. మార్చి 2వ తేదిన ఎట్టి పరిస్థితుల్లో ఛలో హైదరాబాద్ నిర్వహించి తీరుతామని చెప్పారు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. తాము ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించాలో చెప్పేందుకు టిఎన్జీవోలు ఎవరన్నారు. ఏమైనా శాంతిభద్రతల సమస్యలు ఉంటే ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.
తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామన్నారు. పదో పిఆర్సీ, హెల్తు కార్డు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. వాటిని అమలు చేపించేందుకు ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. తెలంగాణ ఉద్యోగుల వల్ల తమకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. వారి వ్యాఖ్యలు నిజం కాదన్నారు. ఉద్యమం వల్ల తమకు ఇళ్ల స్థలాలు రాలేదన్నారు. తాము ఎవరి దయ పైన బ్రతకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా మార్చి 2వ తేదిన ఛలో హైదరాబాద్ నిర్వహించేందుకు ఎపిఎన్జీవో నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనిపై టిఎన్జీవో నేతలు నిన్న విమర్శలు గుప్పించారు. ఎపిఎన్జీవోలు సమైక్యాంధ్ర కోసమే ఛలో హైదరాబాద్ నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి వ్యాఖ్యలను ఎపిఎన్జీవోలు ఈ రోజు కొట్టిపారేశారు.