రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు అంజిరెడ్డి కన్నుమూత
అంజిరెడ్డి 1940లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో జన్మించారు. నూటక్కిలోని అనపోతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. గుంటూరులోని ఎససి కాలేజీలో డిగ్రీ చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఫార్మాస్యూటికల్స్, ఫైన్ కెమికల్స్ అభ్యసించారు. పూణేలోని జాతీయ రసాయన లాబోరేటరీలో కెమికల్ ఇంజనీరింగ్లో ఆయన పిహెచ్డి చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడిపియల్)లో 1969 - 1975 మధ్య పనిచేశారు. ఆ తర్వాత 1976లో యూనిలాయిడ్స్ను ఏర్పాటు చేశారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి ముందు స్టాండర్డ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ను స్థాపించారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ను 25 లక్షల రుపాయల ప్రాథమిక పెట్టుబడితో ప్రారంభించారు.
ఇండియన్ బల్క్ డ్రగ్స్లో దేశాన్ని ఎగుమతి చేసే దిశగా తీసుకుని వెళ్లిన ఘనత అంజిరెడ్డికి దక్కుతుంది. అంజిరెడ్డికి కూతురు, కుమారుడు ఉన్నారు. రెడ్డీస్ ల్యాబ్స్ ఔెషధాల ఉత్పత్తిలో భారదేశానికి గుర్తింపు తెచ్చి పెట్టింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ భారతదేశంలో రెండో అతి పెద్ద ఫార్మా కంపెనీగా నిలిచింది. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన సంపన్నుల జాబితాలో అంజిరెడ్డి 64వ స్థానం పొందారు.