మనదాకా వస్తే: జగన్ పార్టీలో కొత్తొక వింతేనా? గడబిడ
దీంతో అసంతృప్తులు, ఆధిపత్య పోరు పార్టీలో రోజు రోజుకు పెరుగుతోంది. మొన్న ప్రకాశం జిల్లాలో, నిన్న నిజామాబాద్ జిల్లాలో విభేదాలు బయటపడగా తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. ఆయా జిల్లాల్లో మొదటి నుండి లోలోన పలువురు నేతలు ఉడుక్కుంటున్నారు. అయితే సమయం, సందర్భం కోసం పలువురు ఎదురు చూస్తున్నారు. మిగతా జిల్లాల్లోను నివురు గప్పిన నిప్పులా ఉంది. ఆయా జిల్లాల్లో అసంతృప్తి ఎప్పుడైనా బయటపడే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఒక్కరొక్కరు అసంతృప్తులు బయటకు వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రకాశం జిల్లా అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లో అసమ్మతి సెగ రాజుకున్న విషయం తెలిసిందే. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీలోకి రావడంతో ఎప్పటి నుండో పార్టీ కోసం పని చేస్తున్న నేతలు హైదరాబాద్ కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దర్శిలోను వీధికెక్కారు.
శనివారం నిజామాబాద్ జిల్లాలో అసమ్మతి సెగ రాజుకుంది. అక్కడ ఎమ్మెల్యేలు ఎవరూ జాయిన్ కానప్పటికీ ఆధిపత్యం కోసం పోరు సాగుతోంది. పార్టీకి రాజీనామా చేసిన జిల్లా కన్వీనర్ పార్టీపై, జిల్లా సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. పదవులు అమ్ముకుంటున్నారని విమర్శించారు. బాజిరెడ్డి ఆయన ఆరోపణలు ఖండించినప్పటికీ పరిస్థితి హాట్ హాట్గానే ఉంది. ఓ వైపు తెలంగాణ సెంటిమెంట్, మరోవైపు ఆధిపత్య పోరుతో తెలంగాణలో జగన్ పార్టీ గెలుపు కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలు వస్తే అంతేనా....
ఆదివారం పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి సమక్షంలోనే మద్దాల రాజేష్, శ్రీనివాస రావుల వర్గాలు బాహాబాహీకి దిగాయి. పార్టీ మొదటి నుండి ఉన్న తమను కాదని ఇటీవల వచ్చిన ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే మొదటి నుండి కష్టపడుతున్న తమకు ప్రాధాన్యత ఇవ్వడం మానేస్తారా అని మైసూరాను నిలదీశారు.
అద్దంకి, చింతలపూడి తదితర నియోజకవర్గాల మాదిరిగా తమ నియోజకవర్గాల్లోను ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తే తమ భవిష్యత్తేంటనే ఆందోళన జగన్ పార్టీలోని పలు నియోజకవర్గాల నేతల్లో కనిపిస్తోంది. కేవలం ఆ రెండు నియోజకవర్గాలే కాకుండా చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని, మొదటి నుండి పని చేస్తున్న తమ వంటి వారిని పక్కన పెట్టి ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది తమ వరకు కూడా రావొచ్చుననే ఆందోళనలో పలు నియోజకవర్గాల నుండి టిక్కెట్ ఆశిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారట.
ఇన్నాళ్లు పార్టీ కోసం అహర్నిషలు కష్టపడ్డామని, నియోజకవర్గాల్లో టిక్కెట్ ఆశించి పార్టీ అభివృద్ధి కోసం భారీగా ఖర్చు చేశామని అలాంటి తమను కాదని ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే వారికి టిక్కెట్ పైన హామీ ఇవ్వడాన్ని పాతవారు జీర్ణించుకోలేకపోతున్నారట. వారు పునరాలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే స్వయంగా పదుల సంఖ్యలో టిడిపి, కాంగ్రెసు పార్టీల నుండి తమ పార్టీలోకి వస్తారని ఢంకా భజాయిస్తున్నారు.
దీంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ ఆశిస్తున్న నాయకులు ఎన్నికల నాటి వరకు ఆ రెండు పార్టీల నుండి ఏ ఏ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని ఆరా తీయడం ప్రారంభించారట. వారు వస్తే పార్టీ వారికే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కష్టపడి ఫలితం లేకుండా పోతుందని, అందుకే సైలెంట్గా ఉండటమే మంచిదనే అభిప్రాయంతో కూడా కొందరు ఉన్నారట. టిక్కెట్ పైన ఖచ్చితమైన హామీ ఉంటేనే పలువురు చొచ్చుకుపోతున్నారట.