మీకు తేనెతుట్టే... మాకు తల్లి: రాహుల్కు మోడీ చురక
అయోధ్య ఉద్యమానికి గర్వించాలని పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే మత ఘర్షణలు అధికంగా జరిగాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. బీజేపీ 33వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో అద్వానీ మాట్లాడారు. "పార్టీకి సంబంధించి ఇటీవల కొన్ని వ్యవహారాలు నా చెవిన పడుతున్నాయి. నేను కలలుగన్న బీజేపీకి, వీటికి ఏమాత్రం పొంతన లేదు. ఇప్పుడు కావాలనే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా.
ఎందుకంటే, మన పార్టీ దేశానికి ఎంతో మేలు చేస్తుందని నేను భావిస్తున్నా. అయితే, రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిచినంత మాత్రాన దేశానికి మేలు జరగదు. అవినీతి, క్రమశిక్షణ రాహిత్యంపై మనం ఉక్కుపాదం మోపాలి'' అని అద్వానీ వ్యాఖ్యానించారు. మన అయోధ్య ఉద్యమంపై పశ్చాత్తాపం చెందాల్సిన పని లేదని, దానిని గర్వంగా భావించాలని పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించారు. "రామ మందిరం, అయోధ్య అంశాన్ని మన పార్టీయే తెరపైకి తీసుకొచ్చింది. దానివల్లనే బిజెపి, భారతీయ జన సంఘ్లు ఈ స్థాయికి ఎదిగాయని ప్రజలు అంటుంటారు.అందుకు నేనెంతో గర్విస్తున్నా. ఒక రాజకీయ ఉద్యమంగానే కాదు.. సాంస్కృతిక ఉద్యమంగానూ దానిని చేపట్టాం'' అని అద్వానీ వ్యాఖ్యానించారు.
నిజం మాట్లాడితే ప్రజా విశ్వాసాన్ని పొందవచ్చని చెప్పారు. "ఇటీవల ములాయంసింగ్ నన్ను పొగిడారు. చాలా మంది ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారని అనుకున్నారు. నిజం మాట్లాడితే ప్రపంచం మొత్తం దానిని అంగీకరిస్తుంది. హిందూ, భారతీయ, ఇండియన్ అన్నవి పర్యాయ పదాలని, హిందూత్వం, భారతీయం ఒక్కటేనన్నారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.