ఆళ్లగడ్డ, డోన్లలో వైయస్ సభలకు 'ఉపాధి' నిధులు
ఆళ్లగడ్డ, డోన్ మండలాల్లోని భారీ వేదికలకు, లైట్లు, మైక్ సెట్, సోఫా సెట్లు తదితరాలకు అయిన ఖర్చును ఉపాధి హామీ పథకం ఖాతాలో వేశారని చెప్పింది. నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించారని తప్పుబట్టింది. యూపిఏ ప్రభుత్వ ప్రాధాన్య పథకమైన మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు ఇదీ అని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు కాగ్ రూపొందించిన నివేదికను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
ఆ నివేదికలో కాగ్.. ఉపాధి హామీలోని లోపాలను ఎత్తి చూపింది. పథకం అమల్లో లెక్కలేనన్ని అవకతవకలు జరుగుతున్నాయని దుయ్యబట్టింది. నిధులను దారి మళ్లించారని, అనుమతులు లేకుండానే రూ.2252 కోట్ల పనులను చేపట్టారని తప్పుబట్టింది. వివిధ పనుల కోసం రూ.6547 కోట్లు ఖర్చు చేసేశారు. కానీ, సదరు పనులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని తీవ్రంగా అభిశంసించింది.
పథకం అమల్లోకి వచ్చిన ఆరేళ్ల తర్వాత కూడా కేంద్రస్థాయిలో సరైన మూల్యాంకన, పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయలేదని తప్పుబట్టింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2006లో చేపట్టిన ఈ పథకంలో ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా రూ.4070 కోట్ల విలువైన 7.69 లక్షల పనులు అసంపూర్తిగానే ఉండిపోయాయని స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాల్లో ఉపాధి నిధులను వేరే పథకాలకు మళ్లించారని స్పష్టం చేసింది.