పవన్ కళ్యాణ్ మాట్లాడకుంటే నేరమే, రంగా హత్యతో ఎన్టీఆర్ ఓటమి: బాబుకు అంబటి
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టు పైన జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించాలని, ఈ విషయమై అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని, దీని గురించి స్పందించకుంటే నేరం అవుతుందని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అన్నారు.
ఆయన ముద్రగడ అరెస్టు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. ప్రతి ఒక్కరూ ఈ అరెస్టును ఖండించాలని, తద్వారా చంద్రబాబుకు బుర్రలో మంచి ఆలోచన వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు.
కాపు గర్జన వద్ద కావాలనే..
కాపు గర్జన వద్ద కావాలనే చంద్రబాబు పోలీసులను పెట్టలేదన్నారు. అందుకే తుని ఘటన జరిగిందన్నారు. నేరాలు జరగాల్సిన పరిస్థితిని చంద్రబాబు కల్పించారన్నారు. సీలో చేర్చమని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అందుకే ముద్రగడ ఇప్పుడు అడుగుతున్నారని చెప్పారు.
ముద్రగడ పద్మనాభం తనయుడిని కొట్టవలసిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఈ సందర్భంగా అంబటి ఓ వీడియో చూపించారు. చంద్రబాబు ఓ మాట మాట్లాడారని, వైయస్ రాజశేఖర రెడ్డి దేవుడయ్యాడా, కాపులకు అన్నీ చేస్తున్న నేను మంచివాడిని కాదా అని ప్రశ్నించారని, అది విడ్డూరమన్నారు.
వంగవీటి రంగా హత్య తర్వాత ఎన్టీఆర్ ఓడిపోయారు
కాపులకు వైయస్ ఎన్నో చేశారని, అందుకే ఆయన కాపుల పాలిట దైవం అయ్యారని, మీరు మాత్రం హింసిస్తున్నారు కాబట్టి కాపుల పాలిట రాక్షసుడివి అయ్యావన్నారు. వంగవీటి రంగా, ఎన్టీఆర్ అంశాలను ఈ సందర్భంగా అంబటి ప్రస్తావించారు. నాడు వంగవీటి రంగా హత్య తర్వాత ఎన్టీఆర్ ఓడిపోయారని, ఇప్పుడు చంద్రబాబుకు అదే గతి పట్టడం ఖాయమన్నారు.
ఓ మాజీ మంత్రిని, కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడను చిత్రహింసలకు గురి చేస్తున్న చంద్రబాబు అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రభుత్వం ముద్రగడను ఎన్నో చిత్రహింసలకు గురి చేసినా, రాజమహేంద్రవరంలో ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారన్నారు.
ఇందుకు ముద్రగడను తాను అభినందిస్తున్నానని చెప్పారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో పలువురిని హౌస్ అరెస్ట్ చేయడం, కొన్ని ఛానల్స్ను ఆఫు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కడం సరికాదన్నారు.
విభజన బిల్లు సమయంలో..
విభజన బిల్లు సమయంలో పార్లమెంటులో తలుపులు మూసివేసి, దారుణంగా బిల్లును పాస్ చేయించారని, అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గతి పట్టిందో చంద్రబాబుకు అదే గతి పడుతుందన్నారు.
నిజాయితీగా కాపుల కోసం పోరాడుతున్న వ్యక్తిని చిత్రహింసలకు గురి చేసిన పాపం చంద్రబాబుకు తగులుతుందన్నారు. పోలీసులు బలగాలు తన చేతుల్లో ఉన్నారని, ఇష్టారీతిన వ్యవహరించడం సరికాదన్నారు. చంద్రబాబు కూడా ఓ సమయంలో నిరాహార దీక్ష చేశారని, ఆయనను పోలీసులు అరెస్టు చేశారన్నారు.
కానీ పోలీసులు చంద్రబాబును కొట్టలేదన్నారు. కానీ ఇప్పుడు ముద్రగడ కొడుకును కొట్టవలసిన అవసరం ఏముందన్నారు. లాఠీచార్జ్ దురదృష్టకరమైన అంశమని చెప్పారు. తాను పురుగుల మందు తాగి చనిపోతానని ముద్రగడ చెప్పలేదన్నారు.
కానీ, పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకొని వస్తే, తాను పురుగుల మందు తాగుతానని ముద్రగడ చెప్పారన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా పరిష్కారం ఉంటుందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు.
తలుపలు తెరుచుకుంటున్నాయి
ఓ వర్గం తలుపులు నిన్ను ఇంటికి పంపించేందుకు తెరుచుకున్నాయని అన్నారు. ముద్రగడ ఇంటి తలుపులు తెరిపించినప్పుడే అది ప్రారంభమైందన్నారు. ముద్రగడ దీక్ష చేస్తుంటే ఛానల్స్ ప్రసారం చేయవద్దా అని ప్రశ్నించారు. ఛానల్స్ ఆపేస్తారా అని నిలదీశారు. ప్రసారాలు ఆపడం ఏమిటన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది సొంత వ్యవహారాలు చూసేందుకు కాదన్నారు. ముద్రగడను ఆసుపత్రికి చేర్చినంత మాత్రాన కాపుల్లో రగులుతున్న మంటలు ఆగిపోతాయని అనుకోవద్దన్నారు. కాపులకు చంద్రబాబు హామీ ఇచ్చారా లేదా చెప్పాలన్నారు.
చంద్రబాబు తీరు సరికాదని, ఆయన పునరాలోచన చేయాలన్నారు. చంద్రబాబు తన వైఖరికి భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ముద్రగడకు ఎనిమిది వేల ఓట్లు కూడా రాకపోవచ్చునని, కానీ దానిని టిడిపి నేతలు ప్రస్తావించడం సరికాదన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని గుర్తించాలన్నారు.