ఏపీలో వెలుగుచూసిన మరో భారీ కుంభకోణం: హవాలా దందాలో ప్రముఖ ఆసుపత్రులు..
సింగపూర్, మలేసియా ద్వారా తరలించిన డబ్బును హవాలా మార్గంలో విదేశాల నుంచి రప్పించుకున్నారు. ఈ డబ్బు విషయంలోనే రవి, హేమంత్, న్యూరాలజిస్టు రామకృష్ణలకు బ్రహ్మాజీతో బేదాభిప్రాయాలు వచ్చాయి.
విజయవాడ: విశాఖలో బయటపడ్డ 1500కోట్ల హవాలా కుంభకోణం కేసు ఇంకా తెరపై ఉండగానే.. ఏపీ ఆర్థిక రాజధాని విజయవాడలో మరో హవాలా కుంభకోణం వెలుగుచూసింది. విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రుల ఎండీలు, స్థానిక పోలీసుల పాత్ర ఇందులో కీలకంగా ఉండటంతో.. ఈ కేసు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రులుగా ఎదిగిన హెల్ప్, టైమ్ ఆసుపత్రుల ఎండీల హవాలా లీలలు ఏజెంట్ ను కిడ్నాప్ చేసి, చిత్రహింసల పాలు చేయడంతో ఈ కుంభకోణం బయటపడింది. సకాలంలో హవాలా డబ్బును అందించలేదన్న కారణంతో ఏజెంట్ ను కిడ్నాప్ చేయడం.. పోలీసులు సెటిల్మెంట్ కు దిగిన సమయంలో ఇది బట్టబయలైంది.
ఏజెంట్ బ్రహ్మాజీ కీలక పాత్ర:
జాతక చక్రం ఆధారంగా రంగురాళ్లను విక్రయించే వ్యాపారం చేసే బ్రహ్మాజీకి విజయవాడలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయలున్నాయి. ఈ క్రమంలో విదేశాల నుంచి అతి తక్కువ వడ్డీకి డబ్బు తెప్పించి, స్థానిక వైద్యులకు అధిక వడ్డీకి ఇస్తుండేవాడు. దీనిని ఆసరాగా చేసుకున్న హెల్ప్ ఆసుపత్రి ఎండీ చటపాటి రవి, టైమ్ ఆసుపత్రి ఎండీ మైనేని హేమంత్, న్యూరాలజిస్టు రామకృష్ణలు హవాలా వ్యాపారానికి తెరదీశారు.
హవాలా మార్గం ఇలా:
హెల్ప్ ఆసుపత్రి ఎండీ చటపాటి రవి, టైమ్ ఆసుపత్రి ఎండీ మైనేని హేమంత్ రూ.50 కోట్లు సింగపూర్, మలేసియా ద్వారా తరలించిన డబ్బును హవాలా మార్గంలో విదేశాల నుంచి రప్పించుకున్నారు. ఈ డబ్బు విషయంలోనే రవి, హేమంత్, న్యూరాలజిస్టు రామకృష్ణలకు బ్రహ్మాజీతో బేదాభిప్రాయాలు వచ్చాయి.
దీంతో బ్రహ్మాజీని కిడ్నాప్ చేయాలన్న ఉద్దేశంతో.. రవి, హేమంత్, రామకృష్ణలు టైమ్ ఆసుపత్రికి చెందిన ఇన్నోవా కారులో లోకల్ గూండా సన్నీ, అతని సహచరులు ఏడుగురి సాయంతో అతన్ని కిడ్నాప్ చేసి, ఒక మామిడి తోటకు తీసుకెళ్లారు.
మూకుమ్మడి దాడి:
మామిటి తోటకు తీసుకెళ్లి బ్రహ్మాజీపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. హవాలకు సంబంధించిన రిసీట్ ఇవ్వాల్సిందిగా బ్రహ్మాజీని చితగ్గొట్టారు. అలాంటిదేమి లేదనడంతో.. అతని వద్దనున్న 11 వేల రూపాయలు, 8 ఉంగరాలు తీసుకుని మళ్లీ దాడికి పాల్పడ్డారు.
తనవద్ద రిసీట్ లేదని ఎంత చెప్పినా.. వారు వినకపోవడంతో ఇంటి వద్దనున్న పర్సులో ఆ రిసీట్ ఉందని బ్రహ్మాజీ అబద్దం ఆడాడు. దీంతో గ్యాంగ్ లీడర్ సన్నీ, సీహెచ్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని బ్రహ్మాజీ ఇంటికి పంపించాడు.
బ్రహ్మాజీ భార్య ఫిర్యాదుతో:
బ్రహ్మాజీ ఇంటికి రాకుండా.. వేరే మనిషిని పర్సు కోసం పంపించడంతో అతని భార్యకు అనుమానం తలెత్తింది. ఇన్నోవా కారులో తన ఇంటికి వచ్చిన వారిప పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ కారు వివరాలు తీయడంతో.. టైమ్ ఆసుపత్రి పేరిట దాని రిజిస్ట్రేషన్ ఉన్నట్లు తేలింది.
పోలీసుల హస్తం:
కేసు వివరాలు చేధిస్తున్న కొద్ది పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఏకంగా పోలీసు శాఖలోని వ్యక్తులే ఈ వ్యవహారంలో తలదూర్చినట్లుగా నిర్దారించారు. పటమట సీఐ జాన్ కెన్నడీ, ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావుకు కూడా భాగమున్నట్టు తేలడంతో.. వీరిద్దరినీ విధుల నుంచి తప్పించి.. సీపీ గౌతమ్ సవాంగ్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
రాజకీయ నాయకులపై అనుమానం:
కుంభకోణంలో ఉన్నతాధికారుల హస్తం బయటపడటంతో.. దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తమైనా ఉందా? అన్న కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పక్కదారి పట్టే ప్రమాదం ఉందని భావించిన గౌతమ్ సవాంగ్ స్వయంగా కేసును డీల్ చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకుల నుంచి సీపీ మీద ఒత్తిళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెల్ప్, టైమ్ ఆసుపత్రుల ఎండీలు పరారీలో ఉండగా.. మరికొంతమంది అజ్ఞాతంలోకి జారుకున్నట్లు సమాచారం.