విశాఖ వెళ్లేందుకు సిద్ధం- మే 31 లోపు పంపాల్సిందే... ఏపీ సచివాలయ ఉద్యోగుల తీర్మానం
ఏపీలో అధికార వికేంద్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధాని విశాఖకు అమరావతి నుంచి ఉద్యోగుల తరలింపుకు ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. ఈ మేరకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ఉద్యోగసంఘాలు అంగీకరించడంతో ఏ క్షణాన్నయినా ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. మే 31లోగా తమను విశాఖకు తరలించాలని ఉద్యోగులు ప్రభుత్వానికి ఓ తీర్మానం పంపనున్నారు.
విశాఖకు ఉద్యోగులు ఓకే..
ఏపీ కార్యానిర్వాహక రాజధాని విశాఖపట్నానికి తరలివెళ్లేందుకు అమరావతి సచివాలయ ఉద్యోగులు అంగీకరించారు. ప్రభుత్వంతో కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చల్లో భాగంగా తమ వద్దకు వచ్చిన ప్రతిపాదనలను చర్చించిన సచివాలయ ఉద్యోగ సంఘం ఈ మేరకు విశాఖ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా చేపట్టిన విశాఖ తరలింపుకు ఆమోదం తెలుపుతున్నట్లు ఉద్యోగసంఘాలు ఇవాళ ప్రకటించాయి.
Recommended Video
మే 31లోగా తరలించండి..
విశాఖకు తరలి వెళ్లేందుకు సిద్ధమైన సచివాలయ ఉద్యోగసంఘాలు ఈ మేరకు ప్రభుత్వానికి ఓ తీర్మానం పంపనున్నారు. అదే సమయంలో ఈ ఏడాది మే 31లోగా తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరనున్నారు. లేకుంటే విద్యాసంవత్సరం ఆరంభంలో తమకు సమస్యలు తప్పవని వారు ప్రభుత్వానికి విన్నవించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అందిన మిగతా ప్రతిపాదనలను ఆమోదిస్తూనే ఈ అంశాలను కూడా ప్రభుత్వానికి విన్నవించాలని వారు ఇవాళ నిర్ణయించారు.