పోలీసులను రేయ్ అని పిలవడం మంచిది కాదు: బీజేపీ ఎంపీ
అమరావతి: విజయవాడలో ఆలయాల తొలగింపుపై బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు స్పందించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా ఆలయాలను తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో ముస్లింలు ఏ విధంగా తొలగించారో అదే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు. ఆలయాలను తొలగింపును వ్యతిరేకిస్తున్న వారిని బెదిరిస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడడం సరికాదని ఆయన అన్నారు.
ఆలయాల కూల్చివేతలపై ఉద్యమం చేస్తామని ఎంపీ చెప్పారు. పార్టీ పరంగా మైత్రి కొనసాగిస్తునే ఆలయాల కూల్చివేతపై పోరాటం చేస్తామని ఆయన తేల్చిచెప్పారు.పోలీసులను రేయ్ అని పిలవడం మంచిది కాదనీ, అలా పిలిస్తే మంత్రిపైనా కూడా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.
నగరంలోని కెనాల్రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ తొలగింపునకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేశారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ మేరకు పాలక వర్గంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలయాల తొలగించడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో ఆలయాల కూల్చివేతను అన్ని పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఇటీవలే విజయవాడ బంద్కు కూడా పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు నగరంలో 44 ఆలయాలను ధ్వంసం చేశారు. అభివృద్ధి పేరిట ఈ ఆలయాల తొలగింపు వెనుక ఎంపీ నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హస్తం ఉందని సమాచారం
మరోవైపు త్వరలో కృష్ణా పుష్కర రానున్నాయి. పుష్కర పనుల్లో భాగంగా కొత్త ఘాట్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఘాట్ల వద్ద పెట్టిన దేవుడి విగ్రహాలు తొలగించారు. దీంతో ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ల వద్ద ఉన్న ఆలయం నుంచి ఒక ఇటుక తొలగించినా ఊరుకోమని అన్నారు. ఇప్పటివరకూ తొలగించిన ఆలయాలను అక్కడే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.