ఇవియంల్లో భద్రం: నేతల జాతకాలు తేలేది 16న
హైదరాబాద్: అత్యంత ఉత్కంఠగా సాగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ బుధవారం ముగిసింది. తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు, 119 శాసనసభా స్థానాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరగగా, సీమాంధ్రలోని 25 లోకసభ స్థానాలకు, 175 శాసనసభా స్థానాలకు బుధవారం పోలింగ్ ముగిసింది. ఫలితాల విషయంలో ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
కాగా, సీమాంధ్రలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, నారా చంద్రబాబు నాయుడి నాయత్వంలోని తెలుగుదేశం పార్టీకి పోటీ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. సీమాంధ్రలో తాము అధికారంలోకి వచ్చి తీరుతామని వైయస్ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధిస్తే వైయస్ జగన్ సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. కేంద్రమంత్రి చిరంజీవి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ కాంగ్రెసుకు సీమాంధ్ర ప్రచార రథసారథిగా పనిచేశారు. అందువల్ల ఫలితాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. సీమాంధ్రలో ఏ మాత్రం కాంగ్రెసు ఉనికి చాటుకున్నా అది చిరంజీవికి అనుకూలమవుతుంది.
సీమాంధ్రలోని కొద్ది నియోజకవర్గాలు మినహా అధిక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు హోరాహోరీ పోరాడాయి. విజయం ఎవరిని వరిస్తుందనేది చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉంది. కాంగ్రెసు పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ ఊసు కనిపించనే లేదు. అధికారికంగా రాష్ట్ర విభజన జరగకపోయినా పోలింగ్ మాత్రం విభజనకు అనుకూలంగా విడివిడిగానే జరిగినట్లు అనిపించింది.
కాగా, తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెరాస మెజారిటీ సీట్లు సాధిస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెసు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ తప్పదు. తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. తెలుగుదేశం, బిజెపి కూటమి కొన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఎవరి అంచనాల్లో వారు ఉన్నప్పటికీ ఈ నెల 16వ తేదీన గానీ నేతల జాతకాలు బయపడవు. ఈ నెల 16వ తేదీ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపి - టిడిపి కూటమి అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశంతో పనిచేశాయి. బిజెపి - టిడిపి కూటమి ఎక్కువ స్థానాలు గెలిస్తే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి దోహదపడుతుంది. కేంద్రంలో అధికారం విషయంలో తెలంగాణ, సీమాంధ్ర లోకసభ స్థానాలు నిర్ణాయక పాత్ర వహించే అవకాశం ఉంది.
ఎక్కువ లోకసభ స్థానాలు గెలుచుకుని కెసిఆర్, జగన్ తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా కేంద్రంలో మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. కేంద్రంలో యుపిఎ, ఎన్డియే కూటముల్లో ఏది అధికారంలోకి వచ్చే పరిస్థితి ఆ కూటమికి వీరిద్దరు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. తృతీయ కూటమి అధికారం చేపట్టే అవకాశం వస్తే కూడా ఈ వీరు కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా తెలంగాణ, సీమాంధ్ర ఫలితాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకృతమై ఉంది.