మాపై కేసులు మామూలే! మీ గురించి గొప్పగా చెప్పుకునేలా: బాబుకు జగన్
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కేంద్రానికి భయపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఏపీ సీఎం పైన మంగళవారం దుమ్మెత్తిపోశారు. విశాఖలో ఆంధ్రా వర్సిటీ విద్యార్థుల యువభేరీలో ఆయన మాట్లాడారు.
చదువు పూర్తయ్యాక విద్యార్థులు హైదరాబాదుకు వెళ్లి ఉద్యోగం వెతుక్కుంటారన్నారు. 90 శాతం ఉద్యోగాలు హైదరాబాదులోనే ఉంటాయన్నారు. హైదరాబాదు తెలంగాణకు వెళ్లడం వల్ల... ఏపీకి అన్యాయం జరుగుతోందని, అందుకే మీకు ప్రత్యేక హోదా ఇస్తామని యూపిఏ ప్రభుత్వం, బిజెపి చెప్పాయన్నారు.
విభజన సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ పార్లమెంటులో ఉందని, టిడిపి ఓటు వేసి రాష్ట్రాన్ని విడగొట్టించారన్నారు. ప్రత్యేక హోదా హామీతో రాష్ట్రాన్ని విడగొట్టారని చెప్పారు. ఐదేళ్లు హోదా అని కాంగ్రెస్ అంటే, బిజెపి పదేళ్లు అని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్నారు. హైదరాబాద్ పక్క రాష్ట్రానికి పోవడంతో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపి ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఏమీ నెరవేర్చలేదన్నారు.
జాబు కావాలంటే బాబు రావాలని టిడిపి చెప్పిందని, కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు దాని ఊసు లేదన్నారు. యువతకు ఉద్యోగాల పైన చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వడం లేదన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి సంజీవినిలా కనిపించేది ప్రత్యేక హోదా అన్నారు. చంద్రబాబు ఏనాడు విద్యార్థుల గురించి, యువత గురించి ఆలోచించలేదన్నారు. గతంలో సమైక్య పాలనలో చంద్రబాబు 42 ప్రభుత్వ సంస్థలను మూసివేశారని మండిపడ్డారు.
ఇప్పుడు అవకాశమొస్తే... చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్థలను దివాళా తీయించి, అమ్మేసే ప్రయత్నాలు చేస్తారన్నారు. వర్సిటీల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ చంద్రబాబు వాటిని నింపే ప్రయత్నం చేయడం లేదన్నారు.
కారణం... ఆ వర్సిటీ దివాళా తీసి, మూతబడితే ప్రయివేటు విశ్వవిద్యాలయం తీసుకు వచ్చేందుకే అన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చంద్రబాబు చేస్తున్నారన్నారు. ప్రయివేటు విశ్వవిద్యాలయాలు వస్తే ఫీజు రీయింబర్సుమెంట్స్ కూడా ఉండవన్నారు.
సరే, ప్రయివేటు వర్సిటీలు తీసుకు వస్తే.. ఫీజు రీయింబర్సుమెంట్స్ దేవుడు ఎరుగు కనీసం, స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్ ఉంటుందా అనేది చంద్రబాబు చెప్పాలన్నారు. యూనివర్సిటీల్లో అయిదువేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు దారుణంగా పరిపాలన చేస్తున్నారన్నారు.
ప్రపంచ బ్యాంక్ రేటింగ్ పైన ఎద్దేవా
ప్రపంచ బ్యాంక్ పెట్టుబడుల విషయంలో ఏపీకి రెండో ర్యాంక్ ఇచ్చిందని టిడిపి జబ్బలు చరుచుకుంటుందని జగన్ అన్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ కఠినమైన షరతులు విధించారని, వీటిపై సంతకాలు పెట్టేందుకు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు భయపడ్డారని, కానీ చంద్రబాబు మాత్రం సంతకాలు పెట్టారన్నారు.
పక్కనున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు మోడీ షరతుల పైన సంతకాలు పెట్టేందుకు భయపడ్డారన్నారు. చంద్రబాబు సంతకం పెట్టడంతో రెండో స్థానం, మిగతా రాష్ట్రాలకు పదికి పైగా స్థానాలు వచ్చాయన్నారు. దానినే ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మనం ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదని, ప్రత్యేక హోదా వస్తే ఏపీనే నెంబర్ వన్ అవుతుందన్నారు. ప్రత్యేక హోదాతో మనకు కేంద్రం ఇచ్చే వాటిలో 90 శాతం గ్రాంట్స్ ఉంటాయన్నారు. చంద్రబాబు ఉద్యోగాలు ఇవ్వరని, అలాగే, ఉద్యోగాలు ఇచ్చే హోదా కోసం పోరాటం చేయరన్నారు.
చంద్రబాబు మనిషేనా అనిపిస్తోంది, ఓటుకు నోటు భయంతోనే
ఒక్కోసారి చంద్రబాబును చూస్తుంటే మనిషేనా అనిపిస్తోందన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు పోరాడకపోవడానికి కారణం ఓటుకు నోటు అని అభిప్రాయపడ్డారు. పట్టిసీమ నుంచి ఇసుక, మట్టి, మద్యం వరకు అన్నింటా లంచాలు తీసుకుంటున్నారన్నారు.
అవన్నీ చంద్రబాబుకు అందుతున్నాయని, లంచాల ద్వారా వచ్చిన డబ్బుతో పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎమ్మెల్సీని గెలిపించేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేశారన్నారు.
వీడియో, ఆడియో టేపులతో ఆయన దొరికిపోయారన్నారు. ఈ విషయమై ఈ మధ్య చంద్రబాబును పదేపదే టీవీల్లో చూస్తున్నామన్నారు. అందుకే ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడరన్నారు. హోదా గురించి మాట్లాడేతే బిజెపి ఓటుకు నోటు అంశంపై కీ ఇస్తుందన్నారు.
నాడు తన పైన కూడా ఇలాంటి కాంగ్రెస్, టిడిపిలు కలిసి తప్పుడు కేసులు పెట్టాయన్నారు. వైయస్ బతికున్నంత వరకు తన పైన కాంగ్రెస్ కేసులు పెట్టలేదని, తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాక.. తాను ఆ పార్టీకి చెడ్డవాడినయ్యానని, అందుకే కేసులు పెట్టారన్నారు.
రాజకీయాల్లో కేసులు సహజమే
రాజకీయాల్లో కేసులు సహజమే అన్నారు. అయితే, తన పైన కేసులు ఉన్నప్పటికీ విభజన వద్దని తాను ఉద్యమించానని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఓటుకు నోటుకు భయపడి ప్రత్యేక హోదాను పక్కన పెట్టేస్తున్నారన్నారు. కేసులు ఉన్నాయని, కేసులు పెడతారని రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టవద్దన్నారు.
కేసులకు భయపడకుండా... మా నాయకుడు రాష్ట్రం కోసం ఇలా చేశారని చెప్పేలా చంద్రబాబు హోదా కోసం పోరాటం చేయాలన్నారు. లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు.
హోదా ఇవ్వదని ప్లేటుమార్చిన చంద్రబాబు
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఇటీవల ప్లేటు మార్చారన్నారు. ఎలాగూ కేంద్రం హోదా ఇవ్వదని తెలిసి.. హోదా ఏం సంజీవిని కాదని అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ఎలా మేలు అని నిలదీశారు. పోలవరం తదితరాలపై మనకు ఇస్తామన్న దానినే కేంద్రం ప్యాకేజీ రూపంలో ఇస్తామంటోందన్నారు.
పక్క రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదంటున్నారు కానీ
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటే.. తమిళనాడు, కర్నాటకలు అంగీకరించడం లేదని కేంద్రమంత్రులు చెబుతున్నారని, కానీ వారి పేరు చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. చంద్రబాబు, కేంద్రమంత్రులు అబద్దాలు ఆడుతున్నారన్నారు.
మా చెవుల్లో పూవులు పెట్టవద్దు
ఏపీకి చెందిన తెలిసీ, తెలియని మంత్రులు కూడా 14వ ఆర్థిక సంఘం గురించి మాట్లాడుతున్నారన్నారు. ఆర్థిక సంఘం పరిధి విద్యార్థులకు కూడా తెలుసునని చెప్పారు. దీని పేరు చెప్పి మా చెవుల్లో పూవులు పెట్టవద్దని విద్యార్థులు కూడా చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కేబినెట్ నిర్ణయం అన్నారు.
ప్రధాని చేతిలో ఉంటుందన్నారు. ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల వేలాది పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయన్నారు. ఏపీకి హోదా ఇస్తే అలాగే అభివృద్ధి చెందుతుందన్నారు. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందన్నారు. అలాంటి మన ఏపీకి హోదా ఇస్తే మనకు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు.
ఒక్క జగన్ వల్ల సాధ్యం కాదు
హోదా కోసం తాను 26వ తేదీన నిరవధిక దీక్షకు దిగుతున్నానని, అందరు సహకరించాలన్నారు. ప్రత్యేక హోదా ఒక్క జగన్ వల్ల సాధ్యం కాదని, అందరు తనతో కలవాలన్నారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అన్నారు.