వైయస్ జగన్కు చెక్: చంద్రబాబు బెజవాడ వ్యూహం
హైదరాబాద్: తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేసుకోవడం వెనక పక్కా వ్యూహం ఉన్నట్లు చెబుతున్నారు. కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్తో రాయలసీమలో ఆందోళన ఊపందుకుంటున్న సమయంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ ఆందోళనకు వైయస్ జగన్ మద్దతు ఇస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులతో పాటు బిజెపికి చెందిన రాయలసీమ నేతలు కూడా ఈ ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్ ఎత్తుగడలను తిప్పికొట్టి, తాను అనుకున్న చోట శాశ్వత రాజధానిని ఏర్పాటు చేసుకునే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. విజయవాడలో తాత్కాలిక రాజధాని పేర పాతుకుపోతే అక్కడికి సమీపంలో ఏర్పాటయ్యే శాశ్వత రాజధానికి మారడం సులభమవుతుందని, అప్పటికే విజయవాడ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు నడుస్తున్నందున ఆ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకత ఎదురు కాదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
కేవలం నెలలోనో, వారంలోనో కొద్ది రోజులు విజయవాడలో ఉండడం కాకుండా అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలను అక్కడికి తరలించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నీటి లభ్యత, సారవంతమైన భూములు, రవాణా సౌకర్యాలు, రైల్వే, బస్సులు, ఎయిర్ ట్రాన్స్ఫోర్టులు ఈ మూడు సదుపాయాలు ఉండడంతో తాత్కాలికంగా విజయవాడను రాజధానిగా చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకోగా మరి కొందరు మంత్రులు కామినేని శ్రీనివాసరావు, సిద్దా రాఘవరావు, పొత్తు రవీంద్ర తదితరులు తమ కార్యాలయాలను బెజవాడలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్శిటీ కూడా గుంటూరు సమీపంలో వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
గన్నవరం వద్ద ఐటీ టవర్స్ను పరిశీలించాలని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కలెక్టర్ను ఆదేశించారు. కార్యాలయాల కోసం విజయవాడలో భవనాలను గుర్తించాలని చంద్రబాబు అధికారులను అదేశించినట్లుగా తెలియవచ్చింది. మంగళవారం చంద్రబాబుతో ఏపీ రాజధాని నిర్మాణ కమిటీ సమావేశమైంది. రాజధాని నిర్మాణం పూర్తి అయ్యే వరకు తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని కమిటీకి చంద్ర బాబు తెలిపారు.
మురికివాడలు లేని విధంగా..
మురికివాడలు లేని విధంగా ఎపి రాజధానిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రపంచం హర్షించే విధంగా రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన అన్ానారు. రాజధానిని చూడడానికే విదేశాల నుంచి యాత్రికులు వచ్చేలా ఉండాలని ఆయన అన్నారు. విజన్ ఫర్ ఎపి క్యాపిటల్ పేరు మీద మెకెన్సీ సంస్థ ప్రతినిధులు చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది.