రెండు జూన్లోనే: నాడు చార్ధామ్, నేడు బియాస్ ట్రాజెడీ
హైదరాబాద్: ఉత్తరాఖండ్లో నిరుడు జూన్లో చార్ధామ్ యాత్ర భక్తులు.. ఇప్పుడు విహార, విజ్ఞానయాత్రకు వెళ్లిన విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రెండు ఘటనలు జూన్లోనే చోటు చేసుకున్నాయి. 2013లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ధామ్ పర్యటనలో తలెత్తిన విపత్తు.. తెలుగువాళ్లను కుదిపేసింది.
మృత్యువాత పడ్డ వేలాది మంది భక్తుల్లో తెలుగువారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మరో ఉత్తర భారత దేశ పర్యటన తెలుగు వారిని విషాదంలో నింపింది. నాడు యాత్రలో చెట్టుకొకరు.. పుట్టకొకరు చెల్లా చెదురయ్యారు. సైన్యం రంగ ప్రవేశం చేసింది.
బాధితులను, మృత్యువాత పడ్డ వారిని తీసుకు వచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా విద్యార్థుల ఆచూకీ కోసం అదే పరిస్థితి. ఉత్తరాఖండ్ విషాద సంఘటన నుండి తెలుగు వారు శోకసముద్రం నుండి తేరుకోకముందే.. అదే జూన్ నెలలో 24 మంది విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతయ్యారు.
మరోవైపు, బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి ప్రవాహం, పూడిక తదితరాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తొమ్మిది పడవలతో గాలిస్తున్నాయి. సహాయక చర్యల్లో 84 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం ఆరువందల మంది వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
గాలింపు చర్యలు సులభతరం చేసేందుకు డ్యాంలో నీటిమట్టం తగ్గించేందుకు... 11 గేట్లకు వలలు కట్టి ఒక గేటు ఎత్తి నీటిని దిగువగు విడుదల చేశారు. కేంద్రమంత్రి అశోక గజబతి రాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్తో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు.