ఏపీలో కేసీఆర్ నయా స్ట్రాటజీ - ఆ ముగ్గురికి బాధ్యతలు..!!
ఏపీలో పార్టీ విస్తరణకు కేసీఆర్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇందు కోసం నేతలను ఎంపిక చేస్తున్నారు. ఏరి కోరి ఎంపిక చేస్తున్న ఆ నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. జాతీయ పార్టీ ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. దేశ వ్యాప్త పర్యటనలకు కేసీఆర్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. కర్ణాటకలో ఆయనకు జేడీఎస్ నుంచి మద్దతుపై హామీ లభించింది. అక్కడ జేడీఎస్ - బీఆర్ఎస్ పొత్తు ఖాయమైంది. మహారాష్ట్రలో రైతు సంఘాల మద్దతుతో కావాల్సిన ఓట్లు సాధిస్తామనే అంచనాలు గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ తొలి సమావేశం కూడా మహారాష్ట్రలోనే జరగనుంది. ఇక..ఏపీలో కేసీఆర్ ఆచూతూచి అడుగులు వేస్తున్నారు.
ముగ్గురు నేతలను ఎంపిక చేసారంటూ
తెలంగాణలో ఏపీ సీఎం జగన్ రాజకీయంగా ఎక్కడా జోక్యం చేసుకోవటం లేదు. దీంతో..ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ సమయం లో ఏ రకంగా మందుకెళ్లాలనే దాని పైన తుది కసరత్తు జరుగుతోందని సమాచారం. అందులో భాగంగా ఏపీకి సంబంధించి పార్టీ విస్తరణ కోసం కేసీఆర్ ముగ్గురు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించినట్లుగా పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో సామాజిక వర్గాల రాజకీయం ఎక్కువగా ఉండటంతో..కేసీఆర్ ఎంపిక సైతం అదే కోణంలో జరిగినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి నుంచి ఆ ముగ్గురు నేతలు ఏపీలో బీఆర్ఎస్ కోసం వరుస పర్యటనలు చేస్తారని చెబుతున్నారు. కేసీఆర్ కు చాలా కాలంగా మిత్రుడుగా ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి .. ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఏపీ బాధ్యతలు ఇచ్చేందుకు కేసీఆర్ దాదాపు నిర్ణయానికి వచ్చారని పార్టీ నేతల సమాచారం. పక్కా లెక్కలతోనే ఈ ముగ్గురి ఎంపిక జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణకు దూరంగా జగన్.. మరి కేసీఆర్
ఏపీలో టీడీపీకి మద్దతుగా నిలిచే సామాజిక వర్గంలోని నేతలతో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సీనియర్ నేత గతంలో చంద్రబాబు హయాంలోనూ మంత్రిగా పని చేసారు. ఇప్పుడు ఆయన పేరు ఏపీ బాధ్యతలు అప్పగించే వారిలో ప్రధానంగా ప్రచారంలో ఉంది. అదే విధంగా ఏపీ వైసీపీ నేతలతోనూ ఖమ్మం మాజీ ఎంపీగా పని చేసిన పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయితే, సీఎం జగన్ తోనూ ఇప్పటికీ పొంగులేటి మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఆయన ఈ బాధ్యతల నిర్వహణకు సిద్దంగా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక, మంత్రి తలసాని కి ఏపీకి ఈ మధ్య కాలంలో తరచూ పర్యటనలు సాగిస్తున్నారు. సంక్రాంతి వేళ కోడి పందాలు చూసేందుకు..విజయవాడ లో అమ్మవారి దర్శనం కోసం తలసాని పలు మార్లు ఏపీకి వచ్చారు. ఆయనకు సామాజికంగా నూ ఏపీలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ విధేయుడిగా తలసానికి పేరుంది.
జాతీయ పార్టీగా విస్తరణ అవసరమంటూ
అదే సమయంలో హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో భాగ్యనగరం కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న పలువురి ఆంధ్రా ప్రాంతీయలతో ఆయన మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారనేది పార్టీలో వినిపిస్తున్న చర్చ. పలువురు ఆంధ్ర పారిశ్రామిక వేత్తలు - వ్యాపార ప్రముఖులతో మంత్రి కేటీఆర్ కు ఉన్న సంబంధాలు కూడా ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కలిసి వస్తాయని గులాబీ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. అయితే, ఏపీ ప్రజలు విభజన గాయాలను మర్చిపోతేనే..బీఆర్ఎస్ కు ఆదరణ ఉంటుందని, లేకపోతే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ అంత సులువు కాదనే వాదన కూడా వినిపిస్తోంది. హైదరాబాద్ తో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు అక్కడ టీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని గులాబీ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు బీఆర్ఎస్ ను స్వాగతించారు. ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఇక, కేసీఆర్ ఏపీ పైన సంక్రాంతి నుంచి తన కార్యాచరణ అమలు చేసే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.