శాడిజం, రఘువీరా రెడ్డి పక్షులనూ చంపేస్తున్నాడు: జెసి నిప్పులు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి పైన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి ఆదివారం నాడు మండిపడ్డారు. రఘువీరా ఓ శాడిస్ట్ అని, ఆయన చివరకు పక్షులనూ చంపుతున్నారని ధ్వజమెత్తారు.
వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రఘువీరా ఎందరో రైతుల ఉసురు పోసుకున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యకు కారకుడైన రఘువీరా.. ఇప్పుడు పక్షులను కూడా చంపుతున్నాడని, ఆయన పైన కేసులు పెట్టారని ఆగ్రహించారు.
కాగా, శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన స్థానిక కార్యకర్తలు కొందరు... పావురాలకు క్రాకర్స్ కట్టి నిప్పు అంటించారు. దీంతో అవి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇది వివాదాస్పదం అయింది.
రైతులకు అండగా ఉంటాం: రఘువీరా
రైతులకు అండగా ఉంటామని, ఇక నుంచి రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని .రఘువీరా రెడ్డి శనివారం చెప్పారు. పొగాకు, చెరకు, పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జంగారెడ్డిగూడెంలో రైతు గర్జన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడారు. పొగాకు, చెరకు, పామాయిల్ పంటలకు మెరుగైన ధరలు ఇవ్వాలని డిమాండు చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై క్షేత్రస్థాయిలో మకాం చేస్తామన్నారు. రైతు ఆత్మహత్యలు 1996లో చంద్రబాబు హయాంలోనే ప్రారంభమయ్యాయన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి మలేషియా వెళ్లారని, అప్పటి నుంచే పామాయిల్ గెలల ధరలు తగ్గాయన్నారు. పామాయిల్ దిగుమతికి రూ.65 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని విదేశాలకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. ఎన్నికలు మూడేళ్ల తర్వాత వస్తాయి.
మేము రాజకీయం చేయడం లేదని, కేవలం రైతుల పక్షాన పోరాడటానికి, వారికి మేమున్నామన్న భరోసా ఇచ్చేందుకే గర్జన సభ నిర్వహించామన్నారు. మూడున్నరేళ్ల అనంతరం మళ్లీ మంచి రోజులు వస్తాయని రఘువీరా పేర్కొన్నారు.
ఏ ముఖ్యమంత్రి బతికి ఉండగా యాత్రలకు తన పేరు పెట్టుకోలేదని, చంద్రన్న రైతు యాత్రల పట్ల రఘువీరా ఆక్షేపించారు. కౌలు రైతులు ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదన్నారు. రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా రూ.24 వేలు కోట్లుగా సిగ్గు లేకుండా చెబుతున్నారు. మీరు చేసింది కేవలం రూ.7 వేల కోట్లే కదా అని ప్రశ్నించారు. డ్వాక్రా రుణ మాఫీపైనా విమర్శలు చేశారు.