ఏపీలో కోరనా: సీఎం జగన్ సీరియస్.. ర్యాపిడ్ కిట్స్ కొనుగోళ్లపై రగడ.. పొరుగున రూ.337, ఏపీలో రూ.1200?
కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెరుగ్గానే పనిచేస్తోందని కేంద్రం అభినందించిన కొద్ది గంటలకే అధికార పార్టీపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సౌత్ కొరియా నుంచి కొనుగోళ్లు చేసిన కొవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ లో కమీషన్ల దందా చోటుచేసుకుందని, ఇతర రాష్ట్రాలు చెల్లించిన ధర కంటే నాలుగింతలు ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాలోనూ దీనిపై రగడ కొనసాగుతున్నది. ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. గతానికి భిన్నంగా, అనూహ్యరీతిలో స్ట్రాంగ్ వార్నింగ్ జారీచేశారు.
అసలేం జరిగిందంటే..
కోవిడ్-19 నివారణ చర్యల్లో మాస్ టెస్టింగ్ అనేది కీలక అంశంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం చైనా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కు ఆర్డర్ ఇచ్చింది. అదే సమయంలో వివిధ రాష్ట్రాలు కూడా సొంతగా కొనుగోళ్లు చేపట్టాయి. ఇక ఏపీ ప్రభుత్వం.. సౌత్ కొరియాకు చెందిన ‘ఎస్డీ బయో సెన్సార్' కంపెనీ నుంచి కిట్స్ ను కొనుగోలు చేసింది. మొత్తం 10 లక్షల కిట్స్ కు ఆర్డర్ ఇవ్వగా, ఈనెల 17న తొలి విడత 2లక్షల కిట్లు.. ప్రత్యేకంగా చార్టర్డ్ విమానంలో దిగుమతయ్యాయి. దాదాపు 10 నిమిషాల్లోనే వైరస్ ను నిర్ధారించగలిగే ఈ కిట్స్ తోనే సీఎం జగన్ కు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. కాగా, పొరుగు రాష్ట్రాలు తక్కువ ధరకే కొన్న టెస్టింగ్ కిట్స్ ను ఏపీ సర్కారు అధిక ధర వెచ్చించిందని, ఇందులో అధికార పార్టీ నేతల కమిషన్ దందాకు పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి.
సర్కారు స్పందన..
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కు సంబంధించి ఛత్తీస్ గఢ్, తమిళనాడు ప్రభుత్వాలు చేసిన ప్రకటనలతో ఏపీ వ్యవహారం చర్చనీయాంశమైంది. సౌత్ కొరియా నుంచి 75వేల కిట్స్ ను ఒక్కోటి రూ.337కు కొనుగోలు చేశామని ఛత్తీస్ గఢ్ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ తెలిపారు. తమిళనాడు కూడా రూ.400కే కిట్స్ కొన్నట్లు వెల్లడైంది. కేరళ, కర్నాటక రాష్ట్రాలు కూడా తక్కువ ధరకే కిట్స్ పొందినట్లు చెప్పాయి. దీంతో టీడీపీ, బీజేపీ నేతలు.. ఏపీలో కిట్స్ కొనుగోళ్లపై ప్రశ్నలు లేవనెత్తారు. ఒక్కో కిట్ రూ.1200 పెట్టి కొన్నారని ఆరోపించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ‘‘ఒక్కోకిట్ ధర దాదాపు రూ.700 మాత్రమే. తక్కువ ధరకు కొన్నామని చెబుతోన్న ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, త్వరలోనే స్పందిస్తాం''అని వివరణ ఇచ్చింది. అయితే..
విషప్రచారమంటూ..
కొవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ విషయంలో ఏపీపై దారుణమైన విషప్రచారం జరుగుతోందని జగన్ సర్కారు ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, తొలిసారిగా లీగల్ హెచ్చరికలు సైతం జారీచేసింది. ‘‘ఏపీకి హాని కలిగించే రీతిలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో టెస్టింగ్ కిట్ ధర రూ.1200 అనేది పూర్తిగా అవాస్తవం. ధర సుమారు రూ.700 మాత్రమే. దీనిపై తప్పుడు పుకార్లు పుట్టిస్తున్నవాళ్లను ఊరికే వదిలిపెట్టబోం. తప్పనిసరిగా లీగల్ చర్యలు తీసుకుంటాం''అన్న సీఎం జగన్ ఆదేశాలను ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో కరోనాపై ప్రతిపక్ష నేతలతోపాటు పక్క రాష్ట్రాలకు చెందినవాళ్లు కూడా అవాకులు చెవాకులు పెలుతుండటాన్ని వైసీపీ తీవ్రంగా పరిగణిస్తోంది.
కమిషన్లు కొట్టేశారు..
ఛత్తీస్ గఢ్ మంత్రి ప్రకటన తర్వాత ఏపీలో కిట్స్ కొనుగోళ్లపై మొదట బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఇతర రాష్ట్రాల్లాగా ఏపీ ప్రభుత్వం బహిరంగంగా మాట్లాడటంలేదంటే అర్థమేంటి? సౌత్ కొరియా నుంచి కిట్స్ కొనుగోళ్లలో కమిషన్లు కొట్టేసినట్లేకదా? అని ఆరోపించారు. బీజేపీతోపాటు టీడీపీకి చెందిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లోనూ దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో శనివారం రాత్రి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కిట్స్ ధరను వెల్లడించడంతోపాటు, సంబంధిత ఆర్డర్ కాపీని కూడా బయటపెట్టింది..
ఏపీలో ఇదీ పరిస్థితి..
ఆదివారం మధ్యాహ్నం వరకు వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో కొవిడ్-19 కేసుల సంఖ్య 647కు పెరిగింది. అందులో 65 మందికి వ్యాధి నయంకాగా, 17 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 565గా ఉంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 44 కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో ట్రూనాట్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని, ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వాడకంలోనూ ఏపీ ముందుందని, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు సంబంధించి ఏపీని ఇతర రాష్ట్రాలూ ఫాలో అవుతున్నాయని అధికారులు చెప్పారు.
Recommended Video