కోటంరెడ్డికి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇదే..!!
'సొంత ప్రభుత్వంపైన తీవ్ర ఆరోపణలు చేసిన కోటంరెడ్డికి టీడీపీ అధినేత నుంచి వచ్చిన హామీని మాజీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోటంరెడ్డి వైసీపీ వీడాలని నిర్ణయించారు. దీనికి ముందే టీడీపీతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో సీటు పైన హామీ దక్కిన తరువాతనే ఆయన పైన ప్రభుత్వం పైన ట్యాపింగ్ ఆరోపణలు చేసారని తెలుస్తోంది. కోటంరెడ్డి వ్యవహారం పైన వైసీపీ ముఖ్య నేతలు స్పందించారు. అటు ముఖ్యమంత్రి జగన్ పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తనతో పాటుగా పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

చంద్రబాబు నుంచి హామీ వచ్చాకే
కోటంరెడ్డి చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యల పైన మండిపడ్డారు. కోటంరెడ్డికి మంత్రి పదవి సాధ్యంకాదని చెప్పటంతోనే ఆయన పార్టీ మార్పుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. చాలా మంది సీనియర్లు మంత్రి పదవులు రాకపోయినా ఎమ్మెల్యేలుగా పార్టీలో ఉన్నారని కొడాలి నాని వివరించారు. ఎమ్మెల్యే సీటు ఇస్తానని..మంత్రి పదవి ఇవ్వలేనని దీంతో కోటంరెడ్డి చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే కోటంరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని హామీ దక్కినట్లు ఉందని కొడాలి నాని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు.. కోటంరెడ్డి మంత్రి అయ్యేదీ లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

సాధ్యం కాదని చెప్పిన సీఎం జగన్
కోటంరెడ్డి తనకు జగన్ రెండు సార్లు భీ ఫాం ఇస్తేనే ఎమ్మెల్యేను అయ్యాయని గతంలో చెప్పిన అంశాలను కొడాలి నాని గుర్తు చేసారు. ఇంటిలిజెన్స్ అధికారులు...ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వంలో భాగస్వాము లని చెప్పారు. పరస్పరం సమాచారం మార్పు సాధారణ ప్రక్రియగా తేల్చి చెప్పారు. తమకు ఏదైనా సమాచారం వస్తే పోలీసు అధికారులకు షేర్ చేయటం నిత్యం జరుగుతూనే ఉంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసారు. ఐ ఫోన్ నుంచి ఐ ఫోన్ రికార్డు చేసే అవకాశం లేదంటున్నారని.. స్పీకర్ ఆన్ చేసి రికార్డు చేసే అవకాశం లేదా అని కొడాలి నాని ప్రశ్నించారు. పార్టీని వీడాలని నిర్ణయించిన తరువాతనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

అలాంటి వాళ్లు పార్టీ వీడితేనే మంచిది
నెల్లూరు రూరల్ లో కొత్తగా వైసీపీ ఇంఛార్జ్ వస్తారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో జగన్ బీ ఫాం ఇస్తానంటే పెద్ద సంఖ్యలో నేతలు తరలి వస్తారని నాని పేర్కొన్నారు. కోటంరెడ్డి లాంటి వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోతేనే మంచిదని కొడాలి నాని పేర్కొన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లారని.. జగన్ లెక్కచేయలేదన్నారు. వారిలో ఒక్కరు మినహా మిగిలిన అందరూ ఎన్నికల్లో ఓడిపోయారని నాని చెప్పుకొచ్చారు. రెండు సామాజిక వర్గాలకే మంత్రి పదవులు సాధ్యం కాదని.. బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది జగన్ ఆలోచనగా కొడాలి నాని వెల్లడించారు. శ్రీధర్ రెడ్డి లాంటి వారు పార్టీ నుంచి వెళ్లిపోతనే వైసీపీకి మంచిదని కొడాలి నాని పేర్కొన్నారు. మరో మాజీ మంత్రి పేర్ని నాని సైతం కోటంరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications