వాళ్లే దేవుళ్లు: స్వచ్ఛ హైదరాబాద్ లోగో ఆవిష్కరించిన గవర్నర్, కెసిఆర్
హైదరాబాద్: ప్రపంచంలోనే హైదరాబాద్ భద్రమైన నగరమని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఇంత గొప్ప నగరం ఉండాల్సిన స్థితిలో లేదని చెప్పారు. శనివారం హెచ్ఐసిసిలో స్వచ్ఛ-హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని గవర్నర్ నర్సింహన్, సిఎం కెసిఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ హైదరాబాద్ లోగోను, ఫేస్బుక్ పేజీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుందని చెప్పారు. ఆదివారం ఉదయం ప్రజాప్రతినిధులు, అధికారులు నగరంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించి పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభించాలని అన్నారు. బస్తీలలో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.
ప్లానింగ్ లేకపోవడం వల్లే సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. నగరంలో చెత్త ఊడ్చి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులే తనకు దేవుళ్లని, వారికి శిరస్సు నమస్కరించాలని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత వాళ్లే తనకు ఇష్టమని, వారికి అందరూ సహకరించాలని అన్నారు.
బాపూజీ దళితవాడలకు వెళ్లి పరిశుభ్రంగా ఎలా ఉండాలని చెప్పేవారని తెలిపారు. స్వచ్ఛ భారత్తోనే నిర్మలమైన భారత్ ఆవిష్కృతమవుతుందని గాంధీజీ చెప్పారని తెలిపారు. గాంధీ స్ఫూర్తితోనే భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. నగరంతోపాటు తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం రూ. 200 కోట్లు కేటాయించిందని, కేంద్రమంత్రి నీతి అయోగ్ నుంచి రూ. 75కోట్లు మంజూరు చేయించారని చెప్పారు. ఇందుకు దత్తాత్రేయకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన గవర్నర్ నర్సింహన్కు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
మంచి పనికి దేవుడు ఎప్పుడూ సహకరిస్తాడని చెప్పారు. జిహెచ్ఎంసి స్పెషల్ ఆఫీసర్ సోమేష్ కుమార్ ఈ కార్యక్రమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పారిశుధ్య కార్మికులందరికీ శాల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.
గొప్ప కార్యక్రమం: గవర్నర్
తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్, తెలంగాణ అనే గొప్ప కార్యక్రమాలను తీసుకుందని గవర్నర్ నర్సింహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ నిరుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం ప్రజల ఇంటి వద్దకు వెళుతోందని గవర్నర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులనే కాదు, ప్రజలను కూడా ప్రభుత్వం భాగస్వాములను చేయాలని అన్నారు.
నాలుగు రోజులే చేసే కార్యక్రమం కాదని, ఇది నిరంతంర కొనసాగాలని చెప్పారు. ప్రతీ ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఇది ప్రజల కార్యక్రమం, మన హైదరాబాద్ను మనం శుభ్రంగా ఉంచుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం: దత్తాత్రేయ
ప్రజల భాగస్వామ్యం ఉంటే ఏ కార్యక్రమమైన విజవయంతమవుతుందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. ఏ రంగంలో చూసుకున్నా హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని అన్నారు. అన్ని వనరులున్న రాజధాని అని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ స్వచ్ఛ హైదరాబాద్పై పాట పాడి ఆకట్టుకున్నారు.