Gulab Cyclone : తీరాన్ని తాకిన గులాబ్ తుఫాన్... గంటకు 85కి.మీ వేగంతో గాలులు...
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైంది.ఈ ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవనుంది. ప్రస్తుతం గులాబ్ తుఫాను కళింగపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది.
తుఫాన్ ప్రభావంతో ప్రస్తుతం తీర ప్రాంతంలో 75 కిలోమీటర్ల నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలుల వేగం క్రమంగా 95 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గోపాల్పూర్, కళింగపట్నం మధ్య తీరాన్ని తాకుతుందని తెలిపింది.
గులాబ్ తుఫాన్ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పనరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.ఇప్పటికే వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని 182 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 73 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Srikakulam in Andhra Pradesh witnessed strong winds and heavy rainfall due to Cyclone Gulab (Earlier visuals)
— ANI (@ANI) September 26, 2021
As per IMD, the landfall process has commenced in coastal regions of Andhra Pradesh and Odisha pic.twitter.com/RKSLzv5cGs
ఫిర్యాదులు,అత్యవసర సాయం కోసం కలెక్టరేట్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557,ఎస్పీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబర్ 6309990933లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
రెండు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ :
తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. గులాబ్ తుఫాను వల్ల పశ్చిమ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే హెచ్చరికలు చేసింది.ఈ క్రమంలో తొలుత ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ దాన్ని రెడ్ అలర్ట్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ ఒకరు వెల్లడించారు.
గులాబ్ తుఫాను పశ్చిమం వైపుగా ప్రయాణిస్తూ.. ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా రెండు రాష్ట్రాల్లో పలు రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Recommended Video
తుఫాన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ అలర్ట్ చేశారు. అన్ని జిల్లా కేంద్రాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్,దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయినట్లు తెలిపారు.