బార్ ప్రస్తావనే లేదు, సిట్కు సహకరిస్తా: అజ్ఞాతం వీడిన మల్లాది విష్ణు
అమరావతి: బెజవాడ కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అజ్ఞాతం వీడి విజయవాడలోని తన ఇంటికి చేరుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు, బుధవారం పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కృష్ణలంకలోని స్వర్ణబార్కు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా బార్ ప్రస్తావనే లేదన్నారు. సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అన్ని విధాలా సహకరిస్తా అని అన్నారు. తాను ఇంతవరకు తిరుపతి, షిరిడి పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నామని అంతే తప్ప తాను ఎక్కడికి పారిపోలేదని చెప్పారు.
పారిపోవాల్సిన అవసరం కూడా తనకు లేదని ఆయన వెల్లడించారు. కల్తీ మద్యం కేసులో బుధవారం సిట్ ముందు హాజరు కానున్నారు. రేపు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళ్లనున్న ఆయన పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వర్ణబార్ కల్తీ మద్యం కేసులో బుధవారం (జనవరి 6) కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు అజ్ఞాతం వీడినట్లు తెలుస్తోంది. అంతేకాదు మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ పిటిషన్ను మెట్రోపాలిటన్ న్యాయస్థానం సోమవారం నాడు కొట్టి వేసింది.
మల్లాది విష్ణు సోదరుడి పేరుతో ఉన్న కృష్ణలంకలోని స్వర్ణబార్లో మద్యం సేవించి ఐదుగురు వ్యక్తులు చనిపోగా, 25 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసులో మల్లాది విష్ణు సోదరుడు శ్రీనివాస్తో సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు విష్ణుని 9వ నిందితుడిగా చార్జిషీట్లో చేర్చారు.
అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన మల్లాది విష్ణు అటు పోలీసులకు గాని, ఇటు కోర్టుకు గాని అందుబాటులో లేకుండా పోయారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తమ ముందు హాజరుకావాలన్న కోర్టు ఆదేశాలను మల్లాది విష్ణు పాటిస్తున్నారు.
కోర్టు ఆదేశాల మేరకు మల్లాది విష్ణు అజ్ఞాతం వీడి కోర్టుకు హాజరుకానున్నారు. మరోవైపు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) తరఫు లాయర్ మాట్లాడుతూ.. తాము విష్ణును అరెస్టు చేయమని, విచారణకు హాజరు కావాలని చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ దర్యాఫ్తు అధికారికి మల్లాది విష్ణు సహకరించాలని సూచించింది.