‘చంపాలనే దాడి, జగన్ తప్పించుకున్నారు’: విమానాశ్రయంలో ఏం జరిగిందంటే..?
అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోమన్ రెడ్డిపై జరిగిన దాడి చాలా హేయమైన చర్య అని ఆ పార్టీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో ఐజయ్య శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దాడి ఘటనకు సంబంధించిన వివరాలు చెప్పారు.
Recommended Video
విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ జగన్పై కత్తితో దాడి: రక్తంతో తడిసిన షర్ట్, రోజా వార్నింగ్, కంటతడి
చంపాలనే దాడి..
శ్రీనివాసరావు అనే యువకుడు సెల్ఫీ కోసం జగన్ వద్దకు వచ్చి రెప్పపాటులో కత్తితో దాడి చేసి చంపాలని ప్రయత్నించాడని ఐజయ్య తెలిపారు. కత్తితో దాడి చేసిన వెంటనే నన్ను కొట్టొద్దు, పోలీసులకు అప్పగించండి అని మాత్రమే నిందితుడు అన్నాడని చెప్పారు.
ఎవరీ శ్రీనివాస్?: జగన్ అభిమానా? టీడీపీ అనుచరుడా? ఈ ఫొటోల సంగతేంటి?
పోలీసులకు అప్పగించమని జగన్..
తనపై దాడి చేసిన వ్యక్తిపై ఎవరూ దాడి చేయవద్దని.. పోలీసులకు అప్పగించండని మాత్రమే ఆ సమయంలో వైయస్ జగన్ చెప్పారని ఐజయ్య వెల్లడించారు. విశాఖ విమానాశ్రయంలో ప్రథమ చికిత్స అనంతరం టీటీ వేయించుకున్న తర్వాత వైయస్ జగన్ హైదరాబాద్ వెళ్లారని వివరించారు.
బాబుకు భయం.. జగన్కు ఎందుకు?
జగన్పై జరిగిన హత్యాయత్నంపై సీఎం చంద్రబాబు స్పందించిన తీరు బాధాకరమని అన్నారు. ఏపీ డీజీపీ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని అన్నారు. దాడి జరిగిన తర్వాత వైయస్ జగన్ పక్క రాష్ట్రం వెళ్లిపోయారని టీడీపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయారు కానీ, జగన్కు హైదరాబాద్కు వెళ్లడానికి ఎలాంటి భయం అవసరం లేదని అన్నారు. జగన్ పై దాడి జరిగిన తర్వాత పరిణామాలు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని అన్నారు. దాడి ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలని ఐజయ్య డిమాండ్ చేశారు.
సెల్ఫీ కోసం వచ్చి..
ఇది ఇలా ఉండగా, దాడి ఘటనలో మరో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ తో కలిసి తాము గురువారం మధ్యాహ్నం 12గంటలకు విమానాశ్రయంకు చేరుకున్నామని తెలిపారు. లాంజ్లో నుంచి బోర్డింగ్కు వెళుతుండగా సెల్ఫీ తీసుకుంటానంటూ శ్రీనివాస్ అనే యువకుడు వచ్చాడు. సెల్ఫీ తీసుకుంటూనే కత్తితో దాడి చేశాడు శ్రీనివాస్.
మెడపై దాడికి యత్నం.. జగన్ తప్పించుకున్నారు..
శ్రీనివాస్ మెడపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా.. జగన్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ఆయన భుజానికి గాయమైందని మిథున్ రెడ్డి తెలిపారు. ఇది సెక్యూరిటీ వైఫల్యమేనని అన్నారు. ఎయిర్పోర్టులో దాడి జరిగితే ఇప్పుడు కేంద్రం బాధ్యత అంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. గతంలో విశాఖకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిన రన్ వేపైనే అరెస్టు చేసి అడ్డుకున్నారు కదా? అని ప్రశ్నించారు. శ్రీనివాస్ రాసిన లేఖను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రాణాపాయం ఉందనే హైదరాబాద్కు...
దాడి జరిగిన అనంతరం వైయస్ జగన్ ప్రాథమిక చికిత్స తీసుకుని అక్కడ్నుంచి హైదరాబాద్కు వెళ్లిపోయారని మిథున్ రెడ్డి చెప్పారు. జగన్ భుజానికి 3ఇంచుల గాయమైందని చెప్పారు. మెరుగైన వైద్యం కోసమే హైదరాబాద్ వెళ్లామని చెప్పారు. దాడి జరిగిన తర్వాత మళ్లీ బయటికి వెళ్లాలంటే భయాందోళనకు గురయ్యామని చెప్పారు. ప్రాణాపాయం ఉందని భావించే హైదరాబాద్ వెళ్లామని తెలిపారు.