జగ్గారెడ్డి పేరు చెప్పి ఏకేసిన ఎర్రబెల్లి, బాగాలేదంటూనే..
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ మెదక్ లోకసభ అభ్యర్థి జగ్గారెడ్డి ఉద్యమకారుడు కాకపోతే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు ఆయనకు టిక్కెట్ ఎందుకు ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం ప్రశ్నించారు. కార్యకర్తలు పట్టుదలతో పని చేసి జగ్గారెడ్డిని గెలిపించుకోవాలన్నారు. పటాన్ చెరువులో ఏర్పాటు చేసిన సభలో ఎర్రబెల్లి మాట్లాడారు.
మెదక్ ఉప ఎన్నికల్లో తెరాసను చిత్తుగా ఓడించాలన్నారు. జగ్గారెడ్డిని విమర్శించే నైతిక హక్కు తెరాసకు లేదన్నారు. అభివృద్ధి ఎక్కడ ఉంటే జగ్గారెడ్డి అక్కడ ఉండారన్నారు. కేసీఆర్ అన్నీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు.
తెరాసపై మండిపడ్డ ఇంద్రసేనా
రాష్ట్ర సాధనలో విద్యార్థులు, ఉద్యోగుల కృషి ఉందని, ఇప్పుడు విద్యార్థులే తెరాసకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనా రెడ్డి హైదరాబాదులో అన్నారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినా హామలను పట్టించుకోవట్లేదన్నారు. రాజ్యాంగ సంక్షోభం తెచ్చేలా తెరాస వ్యవహరిస్తోందన్నారు. బడ్జెట్ పెట్టకుండా ఆర్డినెన్స్ ద్వారా తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
రుణమాఫీపై కేసీఆర్ రోజుకో మాట చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 5 విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు లేరని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదా అని ప్రశ్నించారు. గ్రాంట్లు కూడా విడుదల చేయడం లేదన్నారు. విశ్వవిద్యాలయాలను గాలికి వదిలేశారని, ఇందులో కేంద్రం పాత్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు.
తెరాసకే సీపీఎం మద్దతు
మెదక్ ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతిస్తున్నట్లు సీపీఎం బుధవారం ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమ్మినేని చెప్పారు. తెరాస పాలన ఇప్పటి వరకు ఏమాత్రం సంతృప్తికరంగా లేదనే తాము భావిస్తున్నామని, అయితే, బీజేపీ-టీడీపీని ఓడించేందుకు తాము మద్దతిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. తాము తెరాసకు మద్దతిచ్చినప్పటికీ ఆ పార్టీతో కలిసి ప్రచారం చేయమని, ప్రత్యేకంగా సభ నిర్వహిస్తామన్నారు.
ఖరీఫ్కు నీరు విడుదల చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి
నల్గొండ జిల్లా అంగడిపేట ప్రధాన కాల్వ ద్వారా ఖరీఫ్ పంట సాగు కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఖరీష్ సాగు కోసం లక్షా 70 వేల ఎకరాలకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం నాలుగు రోజుల పాటు నీరు విడుదలవుతుందని అధికారులు చెప్పారు.