ఆత్మకూరులో రంగంలోకి మంత్రులు - అసలు లక్ష్యం అదే : పార్టీ కేడర్ తో కలిసి..!!
ఆత్మకూరు ఉప ఎన్నికను వైసీపీ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. టీడీపీ - జనసేన అభ్యర్ధులు ఇక్కడ పోటీలో లేరు. బీజేపీ అభ్యర్ధి తో పాటుగా మొత్తం 13 మంది ఇప్పుడు వైసీపీ పైన పోటీ చేస్తున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. తొలి నుంచి పట్టు ఉన్న నియోజకవర్గం కావటంతో విక్రమ్ కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే ఏపీలో ముందస్తు ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. మరో వైపు వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు.
ఈ సమయంలో జరుగుతున్న ఎన్నిక కావటంతో భారీ మెజార్టీ సాధించి..తమ సత్తా చాటాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా మంత్రులు..సీనియర్ నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. వచ్చే వారం మంత్రులు పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వస్తారని నేతలు చెబుతున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బై పోల్ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా మంత్రి జోగి రమేష్ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ ఆరిపోయే దీపం లాంటిదని ఎద్దేవా చేశారు. బద్వేల్ తరహాలోనే ఆత్మకూరు పరిస్థితి ఉంటుందని.. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పోటీ నుంచి తప్పుకున్నా లోపాయికారి మద్దతివ్వడం టీడీపీకి అలవాటన్నారు.ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బద్వేల్ తరహాలోనే ఆత్మకూరు పరిస్థితి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎన్నిక ఏకపక్షంగా సాగుతోందని.. భారీ మెజార్టీ వస్తుందంటూ ధీమా వ్యక్తం చేసారు.