తల్లీ కూతుళ్ల దారుణ హత్య: అన్న లేని సమయంలో..
గుంటూరు: ఆస్తి వివాదాల కారణంగా తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. అన్నయ్య లేని సమయంలో ఓ వ్యక్తి తన వదినను, ఆమె కూతురిని దారుణంగా చంపేశాడు. గురువారం తెల్లవారు జామున గుంటూరు జిల్లా బాపట్లలో ఈ దారుణం చోటు చేసుకుంది.
బాపట్ల పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంకు చెందిన గౌరు నాగమణి(40) ఆమె కూతురు కొట్టె సాయిలక్ష్మి(21)ని నాగమణి మరిది హన్మంతరావు హత్య చేశాడు. పోలీసుల అన్నదమ్ముల ఇంటి స్థలం విషయంలో అన్న వాటా కూడా తనకే కావాలని హన్మంతరావు డిమాండు చేస్తూ వస్తున్నాడు. అందుకు అంగీకరించని వదినను అడ్డుతప్పించుకోవాలని హన్మంతరావు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నాగమణి ఇంటికి వచ్చాడు.
అన్నయ్య లేడా.. ఊరు వెళ్లాడా అంటూ మటాలు కలిపాడు. ఇంటి స్థలం తనకు ఎప్పుడు రాసిస్తున్నారంటూ వదినతో గొడవకు దిగాడు. నాన్నలేని సమయంలో నువ్వెందుకు వచ్చావంటూ అన్న కూతురు సాయిలక్ష్మి నిలదీసింది. దీంతో ఆగ్రహించిన హన్మంతరావు రోకలిబండతో సాయిలక్ష్మిని తలపై మోది చంపాడు.
ఆ తర్వాత వదినను కూడా రోకలిబండతో కొట్టి చంపేశాడు. ఈ ఘటనతో అక్కడే ఉన్న సాయిలక్ష్మి పిల్లలు సందిప్రియ, సందీప్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే సందీప్ తలకు రోకలిబండ తగిలి గాయమైంది. స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ మహేష్, అర్బన్ సీఐ పీవీ ఆంజనేయులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.