రేవంత్ని జైలుకి పంపిస్తాం! జగన్ అందుకే లీడర్ కాలేదు: లోకేష్ సంచలనం
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. ఓ వ్యక్తికి ధీటైన సమాధానం చెప్పారు. సదరు వ్యక్తి గొంతు చించుకొని మరీ ప్రశ్నించగా.. అన్నా ఓపికగా అడుగు, సమాధానం చెబుతానంటూ లోకేష్ ప్రశాంతంగా, ధీటుగా సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చాడని, ఓటుకు నోటు కేసులో తమ పార్టీకి చెందిన తెలంగాణ నేత రేవంత్ రెడ్డి తప్పు చేసినట్లు రుజువయితే, శిక్ష పడితే ఆయనను జైలుకు పంపించేందుకు టిడిపి సిద్ధంగా ఉందని చెప్పారు.
ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగినట్లుగా తెలుస్తోంది. పలువురి ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పేందుకు వచ్చారు. ఈ సమయంలో ఓ వ్యక్తి తాను మూడు ప్రశ్నలు అడుగుతానని చెప్పారు. దానికి లోకేష్.. ఒక్కటే అడగాలని కోరగా.. మూడు అడుగుతానని చెప్పారు.
హార్ట్ ఎటాక్ వస్తుందేమోనని భయమేస్తుంది
మీరే మూడు అడిగితే మిగతా వారు అడిగేందుకు అవకాశం ఉండదని లోకేష్ చెప్పారు. ఆయన వినిపించుకోకపోవడంతో.. మూడు ప్రశ్నలు అడిగే అవకాశమివ్వడంతో పాటు వాటికి ఓపికగా సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా సదరు వ్యక్తి మూడు ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న అంటూ గట్టిగా అడగడం ప్రారంభించాడు. అప్పుడు నారా లోకేష్.. ఓపిగ్గా అడగాలని, అలా గట్టిగా మాట్లాడితే నీకు హార్ట్ ఎటాక్ వస్తుందేమోనని భయమేస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ మూడు ప్రశ్నలు..
దానికి సదరు వ్యక్తి తనకు హార్ట ఎటాక్ రాదని చెబుతూ.. ప్రశ్నించడం ప్రారంభించారు. జగన్ను విమర్శిస్తారని, మరి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టలతో దొరికాడని చెప్పారు. ఆయనను శిక్షిస్తారా అని అభిప్రాయపడ్డారు.
రెండో ప్రశ్న.. నోట్ల రద్దు చేశారని, దీంతో చెరువులో చేపలు చనిపోతున్నాయన్నారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. నోట్ల రద్దు వల్ల చేపలు ఎందుకు చచ్పిపోతాయని ప్రశ్నించారు. (కాగా, ప్రశ్నలకు ఆ తర్వాత వివరంగా సమాధానం చెప్పారు)
మూడో ప్రశ్నగా... ప్రత్యేక హోదాను అందరూ కోరుకుంటున్నారని, మీరు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని, మీరు సపోర్ట్ చేస్తే మేం అండగా ఉంటామని ప్రశ్నించారు.
మూడు ప్రశ్నలకు లోకేష్ సమాధానం
ఆ వ్యక్తి మూడు ప్రశ్నలు అడిగిన తర్వాత లోకేష్ ఓపికగా సమాధానం చెప్పడం ప్రారంభించారు. మధ్యలో ఏదో మాట్లాడబోగా.. ఆగు తమ్ముడు, కంగారెక్కువ అన్నారు.
జగన్ అవినీతిపరుడని అంగీకరిస్తున్నావా, రేవంత్ను జైలుకు పంపిస్తాం
'జగన్ అవినీతిపరుడు అని అంగీకరిస్తున్నావా (మొదటి ప్రశ్నకు సమాధానంగా..) రేవంత్కు శిక్ష విధిస్తే జైలుకు పంపించేందుకు టిడిపి సిద్ధంగా ఉంది. జగన్ ఇప్పటికే పదహారు నెలలు జైలుకు వెళ్లి వచ్చారు. శిక్ష పడితే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే. టిడిపి ఎవర్నీ కాపాడదు' అని లోకేష్ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పారు.
నోట్ల రద్దుపై.. (రెండో ప్రశ్న)
నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందని లోకేష్ చెప్పారు. పెద్ద నోట్లు అలాగే ఉండాలంటే అవినీతి అలాగే ఉండాలా అని ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు తాత్కాలికమే అని చెప్పారు.
మనలను కనేటప్పుడు కన్నతల్లి కూడా నొప్పులు పడుతుందని, నోట్ల రద్దు వల్ల కూడా అలాగే తాత్కాలిక ఇబ్బంది అన్నారు. దీని వల్ల అవినీతి తగ్గుతుందని, ట్యాక్స్ తగ్గుతుందని, భూముల ధరలు తగ్గుతాయని చెప్పారు. బ్యాంకులో ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గాయని తెలిపారు. ఇబ్బందులు లేవని చెప్పలేదు.. కానీ తాత్కాలికమే అన్నారు.
బాధను చెప్పుకోనివ్వండి.. నాకు లేని ఇబ్బంది మీకేమిటి
లోకేష్ను సదరు వ్యక్తి మళ్ళీ మళ్లీ ఏదో అడగబోయాడు. టిడిపి వాళ్లు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. ఆయన బాధను చెప్పుకోనివ్వండని, ఆయన చెప్పేది చెప్పనీయాలని, నాకు లేని ఇబ్బంది మీకేమిటని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాపై.. (మూడో ప్రశ్న)
ఫ్యాక్స్ కన్ కంపెనీని ఎవరు తీసుకు వచ్చారని లోకేష్ ప్రశ్నించారు. దీంతో ఉద్యోగాలు వచ్చాయన్నారు. త్వరలో హీరో మోటార్స్ రాబోతుందన్నారు. ఏపీకి వచ్చే స్పెషల్ ఇన్సెంటివ్స్ పైన చట్టబద్ధత కోసం టిడిపి పోరాడుతుందని చెప్పారు.
ప్రధానిని తిడతాం సరే.. జగన్ బాధ్యత తీసుకుంటాడా?
హోదా కోసం ప్రధాని నరేంద్ర మోడీని ఇప్పుడు తిడతాం సరే, కేంద్రంతో ఎలాంటి పని వద్దనుకున్నప్పటికీ.. రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు మాత్రం రావని లోకేష్ చెప్పారు. పించన్కు డబ్బులు ఉండవన్నారు. స్మార్ట్ సిటీలు రావన్నారు. మన పనులు కావని చెప్పారు. అందుకు బాధ్యత ఎవరు తీసుకుంటారు.. జగన్ తీసుకుంటారా అని నిలదీశారు.
అందుకే జగన్ నాయకుడు కాలేకపోయారు
జగన్ నీలాంటి యువతను రెచ్చగొడుతున్నారన లోకేష్ అన్నారు. మనం ఆవేశంగా మాట్లాడవచ్చునని కానీ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తి నాయకుడు అవుతాడని, ఆలోచించలేకపోవడం వల్లే జగన్ నాయకుడు కాలేకపోయాడన్నారు.
ఓవర్ నైట్ కాదు..
హైదరాబాదులో సైబరాబాద్ విత్తనం వేశామని, అధి అభివృద్ధి చెందేందుకు ఇరవయ్యేళ్లు పట్టిందని చెప్పారు. సింగపూర్ ఓవర్ నైట్గా అభివృద్ధి చెందిందా అని నిలదీశారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏళ్లు దాటిందని, అయినా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు పోతున్నామని లోకేష్ ప్రశ్నించారు.
వైయస్ సీఎంగా ఉన్నప్పుడు..
తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తెచ్చారో జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. నేను అధికారంలోకి వస్తాను... కంపెనీలు తెస్తానని జగన్ చెబుతున్నారని, హోదా వస్తే కంపెనీలు వస్తాయని విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మరో ప్రశ్నకు...
అదే వ్యక్తి లోకేష్ను మరో ప్రశ్న అడిగారు. మిగతా వారికి అడిగే అవకాశం రావాలి కదా అని లోకేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అతను వినకపోడవంతో సరేనని అఢగమన్నారు.
2002 నుంచి 2010 వరకు దేశ జీడీపీ వ్యవసాయం వల్లే పెరిగింది కదా అని ఆయన ప్రశ్నించగా.. లోకేష్ అవునని చెప్పారు. అలాంటి వ్యవసాయాన్ని వదిలేయమని చెబుతున్నామన్నారు.
దానికి లోకేష్ స్పందిస్తూ.. తమ్ముడు వదిలేయమని ఎవరు చెప్పారు.. నేను అయితే ఎప్పుడు చెప్పలేదు అన్నారు. వ్యవసాయం ద్వారా 80 శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు. అందుకే పట్టిసీమ ప్రాజెక్టు అన్నారు. పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చి రైతన్న ఇబ్బంది పడకుండా ఉండేందుకు చేశామన్నారు.