పవన్ సీమ మహిళల్ని అవమానించాడా!; ఢిల్లీ వెళ్లి పోరాడేంత తెగువుందా?
అనంతపురం : గత సభలతో పోలిస్తే.. మొన్నటి అనంత సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కు మంచి మార్కులే పడ్డాయన్న అభిప్రాయలున్నాయి. అదే సమయంలో.. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. క్షేత్ర స్థాయిలో పరిస్థితి గురించి తెలుసుకోకుండా.. పవన్ అలాంటి వ్యాఖ్యలు చేసుండాల్సి కాదనేది పలువురి సీమ వాసుల అభిప్రాయం.
అనంత సభలో ప్రసంగించిన పవన్.. కరువు వల్ల రాయలసీమలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. మహిళలు తమ మానాల్ని అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే సీమవాసుల నుంచి ఈ వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమలో ఆడవాళ్లు మానాలు అమ్ముకునే పరిస్థితి లేదని వారు అభిప్రాయపడుతున్నారు. సీమ మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
ఇకపోతే.. ప్రత్యేక హోదా కోసం దేనికైనా ఎదురెళ్లడానికి సిద్దమని చెప్పిన పవన్.. ప్రధాని మోడీ విషయంలో మాత్రం ఆ పనిచేయలేకపోతున్నారు. ఓవైపు మోడీని నిలదీసే ధైర్యం చేయకుండానే.. అవసరమైతే సీమ పోరాటానికి ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ వెళ్లి నిరసన చేయడానికైనా సిద్దమని తెలిపారు పవన్. వేదికల నుంచి మోడీని పల్లెత్తు మాట అనడానికి కూడా జంకే పవన్.. నిజంగా ఢిల్లీ వెళ్లి పోరాటం చేసేంత తెగువ చూపిస్తారా? అన్నది కూడా పవన్ పై సీమ వాసులు లేవనెత్తుతున్న ప్రశ్న. మరి వీటన్నింటికి పవన్ ఏం సమాధానం చెబుతారో?