నంద్యాల ప్రజల తీర్పును గౌరవిస్తాం: రఘువీరారెడ్డి
అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు.
ఈ మేరకు రఘువీరారెడ్డి ప్రకటనను విడుదల చేశారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో తమ పార్టీని ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రఘువీరా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఎన్నిక ఫలితాలను సమీక్షించుకుని తాము ముందస్తు కార్యాచరణ వేసుకుని పనిచేస్తామని తెలిపింది. అధికారంతో సంబంధం లేకుండా తమ పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందని రఘువీరారెడ్డి చెప్పారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులు కూడ కొన్ని నియోజకవర్గాల్లో దొరకని పరిస్థితి నెలకొంది. కానీ, రాష్ట్రంలో నెలకొన్న పరిష్థితుల నేపథ్యంలో తమ ఉనికిని నిలుపుకొనేందుకుగాను కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీచేసింది.
నంద్యాలలో మైనారిటీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. కానీ, ఆ పార్టీకి ఆశించిన ఓట్లు రాలేదు. అయితే ఏది ఏమైనా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు.