మంత్రులకు జగన్ కొత్త టాస్క్: ఈ ఆరు వారాల్లో..ఏం చేసైనా సరే:
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడిన నేపథ్యంలో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కూడా ఏకపక్షంగా గెలుచుకోవడానికి వ్యూహాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి బలం ఉన్న జిల్లాలు, నియోజకవర్గాలవారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీల వివరాలను తెప్పించుకోనుందని, దీని బాధ్యతలను మంత్రులకు అప్పగించనుందని సమాచారం.
టీడీపీ బలంగా ఉన్న చోట..
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా పడటానికి ప్రధాన కారణం.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని విశ్వసిస్తోన్న వైఎస్ఆర్సీపీ..రాజకీయంగా ఆయనను టార్గెట్గా చేసుకుంది. చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు, ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకోవడానికి పావులు కదుపుతోంది.
ఏకగ్రీవాల్లో వైసీపీ ఆధిక్యం
ఇప్పటిదాకా 9696 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాగా..వాటిల్లో మెజారిటీ స్థానాలను అధికార పార్టీ ఏకపక్షంగా కైవసం చేసుకోగలిగింది. ఈ స్థానాల సంఖ్య 2,129. టీడీపీ 92 చోట్ల పోటీ లేకుండా గెలవగలిగింది. అలాగే- 652 జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ 125 చోట్ల ఎదురు లేకుండా విజయం సాధించింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుని టీడీపీని దెబ్బకొట్టడానికి వైసీపీ వ్యూహాలను రూపొందిస్తోందని తెలుస్తోంది.
Recommended Video
మంత్రులకు బాధ్యతలు..
దీనికి సంబంధించిన బాధ్యతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులకు అప్పగించబోతున్నట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థలు అనూహ్య పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా పడటంతో ఇప్పటికే మంత్రులు రగిలిపోతున్నారని, వారికి ఈ సరికొత్త టాస్క్ను అప్పగించడం వల్ల ఆశించిన ఫలితాలు అందుతాయని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏం చేసైనా సరే.. మున్సిపాలిటీలను ఏకగ్రీవంగా గెలుచుకోవాలనే లక్ష్యాన్ని వైఎస్ జగన్ మంత్రులు, పార్టీ క్యాడర్కు సూచించబోతున్నట్లు సమాచారం.