ఆస్తి కోసం బావను హతమార్చే స్కెచ్ వేసిన కంత్రీ మరదలు .. డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది !!
సమాజంలో రోజు రోజుకి మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్న వారే కాకుండా, అయిన వారిని కూడా హతమార్చిన వారు ప్రస్తుత సమాజంలో ఆందోళనకు కారణమవుతున్నారు. భర్తను భార్య, భార్యను భర్త, తండ్రిని పిల్లలు, పిల్లలను తండ్రి ఇలా రక్త సంబంధాలను, అనుబంధాలను మరచి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఆస్తి కోసం ఓ మరదలు బావను హతమార్చడానికి వేసిన స్కెచ్, చేసిన ప్లాన్ ఏపీలో హాట్ టాపిక్ అయింది.

బావను చంపేందుకు మరదలి సుపారీ .. డ్యామిడ్ కథ అద్దం తిరిగింది
అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో కంత్రి మరదలి ప్లాన్ అడ్డం తిరగడంతో అమ్మడు అడ్డంగా బుక్ అయ్యింది. అనంతపురం జిల్లా పోలేవాండ్లపల్లి లో జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఈ హత్యాయత్నం కేసును విచారించిన పోలీసులు బావను చంపటానికి మరదలు స్కెచ్ వేసిందని, కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చిందని, పక్కా ప్లాన్ చేసి పైలోకానికి పంపించాలని ప్రయత్నం చేసినా అది విఫలం అయిందని తేల్చారు.

ఆస్తి కోసం ఘాతుకానికి రెడీ అయిన మరదలు
జగన్మోహన్ రెడ్డి మరదలు భాగ్యలక్ష్మి మొదటినుంచి మంచి ప్రవర్తన ఉన్న మహిళ కాదు, ఆమె టార్చర్ తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె డబ్బు కోసం ఎంత పనయినా చేస్తుందని పోలీసులు వెల్లడించారు. ఆమె బావ జగన్మోహన్ రెడ్డికి పెళ్లి కాకపోవడంతో, పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే, అతని పెళ్లి అయితే ఆస్తి తనకు రాకుండా పోతుంది అన్న అనుమానం జగన్ మోహన్ రెడ్డి హత్యకు ఆమెను ప్రేరేపించింది.

సుపారీ ఇచ్చి కిరాయి హంతకులను మాట్లాడి హత్య ప్లాన్
దీంతో ఎక్కడ ఆస్తి పోతుందోనని భయంతో బావను హతమారిస్తే ఆస్తి మొత్తం తనకే వస్తుందని ప్లాన్ చేసి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. భాగ్యలక్ష్మి సుపారీ ఇచ్చి మరీ మహమ్మద్ అతిక్, జిలాని, విక్టర్ డేవిడ్ లకు ఆ పనిని అప్పగించింది. అందుకు వారికి కొంత డబ్బు కూడా ముందే చెల్లించింది. ఇక ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన బావ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి రమ్మని చెప్పిన భాగ్యలక్ష్మి కిరాయి హంతకులను రంగంలోకి దింపింది.
Recommended Video

అర్దరాత్రి పక్కా స్కెచ్ .. కానీ అడ్డం తిరిగిందిలా !!
రాత్రి నిద్రమాత్రలు కలిపిన కూల్ డ్రింక్ జగన్మోహన్ రెడ్డి తాగేలా చేసి తెల్లవారుజామున 4 గంటలకు మర్డర్ ప్లాన్ చేసింది. కత్తితో మెడపైన, గొంతు పైన పొడవడంతో అతనికి మెలకువ వచ్చి గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వస్తారని నిందితులు అక్కడి నుంచి పారిపోయారు .ఇక కత్తిపోట్లతో గాయాలపాలైన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక మొదటి నుంచి భాగ్యలక్ష్మి తీరును అనుమానించిన పోలీసులు ఆమెను విచారించగా, అసలు విషయం బయటపడింది. ఆస్తి కోసం కంత్రి మరదలు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కదిరి సమీపంలో కౌలేపల్లి రైల్వే గేట్ వద్ద నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుండి ఒక కత్తిని, మూడు సెల్ ఫోన్ లను , ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications