మూడు కార్పోరేషన్లు- మూడు రాజధానులు- వైసీపీ, టీడీపీ భవిష్యత్తును తేల్చేది ఆ ఫలితాలే ?
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా స్ధానిక సంస్ధల ఎన్నికల పోరు జరుగుతున్నా అందులో అందరి దృష్టీ మూడు కార్పోరేషన్లపైనే ఉంది. పురపాలక ఎన్నికల్లో భాగంగా విజయవాడ, గుంటూరు విశాఖ కార్పోరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో వచ్చే ఫలితాలు జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల వాదనకు రిఫరెండంగా నిలవబోతున్నాయి. దీంతో వైసీపీ, టీడీపీ ఇరువురూ ఈ మూడు కార్పోరేషన్లలో పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ మూడు చోట్ల వెలువడే ఫలితాల ఆధారంగా వైసీపీ, టీడీపీ భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయనడంలోనూ ఎలాంటి సందేహం లేదు.
జగన్ ప్రభుత్వ నిర్ణయానికి పరీక్ష
ఏపీలో అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత డిసెంబర్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రటించిన తర్వాత అమరావతిలో చెలరేగిన రాజధాని ఉద్యమం ఇంకా కొనసాగుతోంది. ఈ ఉద్యమం దెబ్బకు వైసీపీ ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో ఎన్నికలను సైతం వాయిదా వేసుకోవాల్సిన పరిస్దితి తలెత్తింది. అయితే మూడు రాజధానులపై అమరావతితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ తీవ్ర ప్రభావం పడుతోంది. అందుకే ఇప్పుడు వాటి పరిధిలోకి వచ్చే విజయవాడ, గుంటూరు కార్పోరేషన్ల ఫలితాలపై అందరి దృష్టీ నెలకొంది.
విశాఖ ఫలితాలపై వైసీపీ గంపెడాశలు
మూడు రాజధానుల ప్రకటనలో భాగంగా విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ జరిగే కార్పోరేషన్ ఎన్నికలు తమకు ఏకపక్ష విజయాన్ని కట్టబెడతాయని వైసీపీ ఆశిస్తోంది. అదే సమయంలో నగరంలో తమకున్న నలుగురు ఎమ్మెల్యేల అండతో కార్పోరేషన్ ఎన్నికల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ ఆశిస్తోంది. అయితే విశాఖ రాజధానిని ఉత్తరాంధ్ర వాసులు ఆహ్వానించం లేదంటున్న టీడీపీ వాదనను తిప్పికొట్టాలంటే వైసీపీకి జీవీఎంసీలో విజయం తప్పనిసరిగా మారింది. దీంతో వైసీపీ నేతలు ఇక్కడ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
కర్నూలుపై ప్రభావం ఎలా ఉంది ?
వాస్తవానికి విజయవాడ, గుంటూరులో అమరావతి ఉద్యమ ప్రభావం, విశాఖలో కొత్త రాజధాని ఇచ్చారన్న అనుకూల ప్రభావం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే హైకోర్టు కేటాయించిన కర్నూలు కార్పోరేషన్ లో ఎలాంటి ప్రభావం ఉండబోతోందన్నది ఈసారి దాదాపు అప్రస్తుతంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ కర్నూలు జిల్లాలో ఏకపక్షంగా విజయాలు సాధించింది. అలాగే హైకోర్టు రాబోతున్న నేపథ్యంలో వైసీపీకి ఇక్కడ వాతావరణం పూర్తి అనుకూలంగా కనిపిస్తోంది. అందుకే మూడో రాజధాని అయిన కర్నూలు ఫలితాలపై అంత ఆసక్తి కనిపించడం లేదు..
ఫలితాలపై ఎవరి ధీమా వారిదే
మూడు రాజధానుల ప్రకటన పరిణామాలు, ప్రస్తుతం ఉన్న ఎన్నికల వాతావరణాన్ని బట్టి చూస్తే విజయవాడ, గుంటూరులో టీడీపీకి, విశాఖలో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ అమరావతి ఉద్యమం ప్రభావం రాజధాని గ్రామాలకే పరిమితమైందని భావిస్తున్న వైసీపీ విజయవాడ, గుంటూరు కార్పోరేషన్లలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే విశాఖలో కొత్త రాజధాని ప్రకటనతో తమకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని నమ్ముతోంది.
ఫలితాలు తేడా కొడితే...
విజయవాడ, గుంటూరు, విశాఖ కార్పోరేషన్లలో ఫలితాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైన తరుణంలో ఎక్కడ తేడా వచ్చినా ముుందుగా ప్రభావం పడేది వైసీపీపైనే. అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమను వదిలిపెట్టి అమరావతి ఉద్యమాన్ని మోస్తున్న టీడీపీ విజయవాడ, గుంటూరులో అనుకూల ఫలితాలు సాధించలేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. అలాగే విశాఖలో ఫలితాలు ఏమాత్రం తేడా వచ్చినా వైసీపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర తిప్పికొట్టిందని టీడీపీ ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఈ మూడు కార్పోరేషన్లలో ఫలితాల కోసం వైసీపీ, టీడీపీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.