నారా లోకేష్ తెరాస దాడి, చంద్రబాబు హెచ్చరిక
మహబూబ్నహప్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఆదివారం మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో చేపట్టిన రోడ్ షోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లోకేష్పై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. ప్రచార రథంపై నుంచి ప్రసంగించడానికి లోకేష్ సిద్ధమవుతున్న తరుణంలో తెరాస కార్యకర్తలు ఆయన కారుపైకి వాటర్ బాటిళ్లు, మామిడి కాయలు, బీరు సీసాలు విసిరారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది లోకేశ్కు రక్షణగా నిలిచారు.
తెరాస కార్యకర్తలు విసిరిన సీసాల్లో ఒకటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, నాగర్ కర్నూలు లోక్సభకు టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన బక్కని నర్సింహులుకు తగిలింది. దీంతో ఆయన వెనక్కి తిరిగి చూడడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయం కావడంతో కారులోనే కూర్చుండిపోయారు. ఆ తర్వాత జడ్చర్లలో జరిగిన సభలో అతి కష్టం మీద ఆయనను లోకేష్ ప్రచార రథంపైకి ఎక్కించారు.

భద్రతా సిబ్బంది ఆయనను జాగ్రత్తగా కిందకు దించారు. అక్కడి నుంచే ఆయనను ప్రత్యేక వాహనంలో శంషాబాద్లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన కాలు విరిగినట్లు సమాచారం. లోకేష్కు మాత్రం ఎటువంటి గాయాలూ కాలేదు. తనపై జరిగిన దాడి మీద లోకేష్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇటువంటి దాడులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.
"మా అమ్మానాన్నలకు నేను ఒక్కడినే కొడుకును. కానీ, మా వెనక లక్షలమంది అన్నా చెల్లుళ్లు తమ్ముళ్లు ఉన్నారు. ప్రత్యర్థులు ఎలాంటి దాడులు చేసినా వెనకడుగు వేయబోం'' అని లోకేష్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాసది దాడులు చేసే సంస్కృతి అని, అధికారాన్ని ఇటువంటి వాళ్లకు కట్టబెడితే రేపు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. భారతీయులు దేశంలో ఎక్కడైనా పర్యటించవచ్చునని,, తమ తమ భావాలను ప్రచారం చేసుకోవచ్చునని ఆన్నారు. ఇటువంటి దాడులకు భయపడనని, యాత్ర కొనసాగిస్తానని అన్నారు.
తెరాస నేత కారు దహనం
లోకేష్ ప్రసంగం ముగించుకొని ముందుకు వెళ్లిన తర్వాత ఆయన కారుపై మామిడి కాయలు వేసిన వ్యక్తిపై తెరాస కార్యకర్తలు దాడి చేసి అతన్ని చితక్కొట్టారు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతడిని తొలుత పోలీసు స్టేషన్కు, అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో మామిడి కాయలు వేసిన వ్యక్తికి చెందిన కారు అక్కడే ఉండడంతో టిడిపి కార్యకర్తలు దానిని దహనం చేశారు.
టిడిపి జోలికొస్తే ఖబడ్దార్: బాబు
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రచారం నిర్వహిస్తున్న లోకేష్పై తెరాస గూండాలు దాడి చేశారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా కోదాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ - లోకేష్ వాహనంపై మద్యం బాటిళ్లతో తెరాస తాగుబోతులు దాడి చేయడం ద్వారా వారి సంస్కృతి ఏమిటో స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. "టీడీపీ జోలికి వస్తే ఖబడ్దార్! నా జోలికి వస్తే వదలను. అవినీతి టీఆర్ఎస్ నన్ను భయపెట్టలేదు'' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications