జగన్కు ఊహించని షాక్.. త్వరలో టీడీపీలోకి కీలక నేత!
వైసీపీ అధినేత వైఎస్ జగన్కి మరో పెద్ద షాక్ తగిలింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న కురుపాం మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
విజయనగరం: వైసీపీ అధినేత వైఎస్ జగన్కి మరో పెద్ద షాక్ తగిలింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న కురుపాం మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
Recommended Video
ఇటీవల వైసీపీకి చెందిన బొబ్బిలి రాజులు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో పార్వతీపురం డివిజన్లో ఉన్న ఆ పార్టీ నాయకుల్లో కూడా కదలిక వచ్చింది. అదే కోవలో ప్రస్తుత ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి స్వయానా మామ అయిన చంద్రశేఖరరాజు కూడా పార్టీ మారనున్నట్లు సమాచారం.
శుక్రవారం జిల్లాలోని కురుపాం నియోజకవర్గం పరిధిలోని చినమేరంగి కోటలో తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కాకి గోవిందరెడ్డి, శ్రీకాకుళం ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు ఆధ్వర్యంలో జియ్యమ్మవలస మండల టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరాజు కూడా హాజరయ్యారు. తాను త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఆయన తన మనసులోని మాటను బయటపెట్టినట్లు తెలుస్తోంది.
కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త, అరకు పార్లమెంటు వైసీపీ ఇన్చార్జి శత్రుచర్ల పరీక్షిత్రాజు తండ్రి చంద్రశేఖరరాజు. ఈయన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైనట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చంద్రశేఖరరాజుకు పేరొంది. నిజానికి వైయస్సార్సీపీ ఏర్పాటు తరువాత విజయనగరం జిల్లాలో ప్రప్రథమంగా ఆ పార్టీకి మద్దతు తెలిపిన వ్యక్తి చంద్రశేఖరరాజే.
కానీ ఎందుకో కొంతకాలంగా చంద్రశేఖరరాజు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతాయ ని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏదిఏమైనా శుక్రవారం జరిగిన పరిణామాలతో.. చంద్రశేఖరరాజు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందని, త్వరలో ఎమ్మెల్సీ విజయరామరాజు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలసి ఆయన సమక్షంలో పసుపుకండువా కప్పుకుంటారని తెలుస్తోంది.