సూర్యుడిపై కేసు పెట్టొచ్చు: హోదా కేసులపై వెంకయ్య వ్యంగ్యం, సోనియాపై బిజెపి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ తమ పైన ఏపీలో కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టడం పైన కేంద్రమంత్రి, బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు తనదైన శైలిలో స్పందించారు.
వర్షాలు కురవడం లేదని, అందుకు సూర్య భగవానుడే కారణమంటూ ఆయనపై కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు పెట్టినా పెట్టవచ్చునని వెంకయ్య వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మంగళవారం నాడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన సందర్భంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణలకు చట్టంలో పొందుపర్చిన హామీలను కేంద్రం ఒక్కోదానిని నెరవేరుస్తోంది. అయితే, ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టక పోవడంతో సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య, హోదా తీసుకు రావడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. దీనిపై వెంకయ్య పైవిధంగా స్పందించారు.
రాజకీయ ఉన్మాదంలో కొట్టుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసమే ఇటువంటి పనులు చేస్తోందని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా, మోడీ, వెంకయ్య, చంద్రబాబులపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తే.. ప్రతిగా బిజెపి నేతలు కూడా ఫిర్యాదులు చేశారు.
కడప పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఫిర్యాదు చేశారు. దశ, దిశ లేకుండా ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోనియాతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, రఘువీరా రెడ్డిలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.