ఉత్తరాంధ్ర ఎవరిది ? బీసీ వర్సెస్ రెడ్డి నుంచి రెడ్డి వర్సెస్ కమ్మ ! వైసీపీ వర్సెస్ టీడీపీ !
కులాల కుంపట్లలో రాజకీయాలు సాగించే రాష్ట్రంగా పేరున్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఎక్కువగా కులసమీకరణాలు తెరపైకి వస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్ధితులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని అంశం కులాల కుంపట్లు రాజేస్తోంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన పరిణామాల్ని సైతం తెరపైకి తెస్తోంది. అంతే కాదు ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న రెడ్డు వర్సెస్ కమ్మల పోరును రచ్చకీడుస్తోంది.
ఉత్తరాంధ్ర కేంద్రంగా కుల పోరు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే క్రమంలో కులాల మధ్య కూడా అంతకు మించిన పోరు కొనసాగుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్ల నేతృత్వంలోని వైసీపీని టార్గెట్ చేస్తే ఇప్పుడు కమ్మోరి నేతృత్వంలో ఉన్న టీడీపీని వైసీపీ సర్కార్ టార్గెట్ చేస్తోంది. వీరిద్దరి మధ్య పోరులో బీసీలతో పాటు ఇతర కులాలు కూడా నలిగిపోతున్నాయి. ఇప్పుడు మూడు రాజధానుల నేపథ్యంలో విశాఖ కేంద్రంగా మొదలైన ఈ పోరు ఉత్తరాంధ్రలో కలకలం రేపుతోంది.
ఉత్తరాంధ్రపై రెడ్ల పెత్తనమేంటన్న కూన రవికుమార్
బీసీల జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో రెడ్ల పెత్తనం ఏంటని తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్నది ఉత్తరాంధ్ర అభివృద్ధికికాదు, ఉత్తరాంధ్ర భూముల కోసమేనన్నారు. బీసీలు అత్యధికంగా ఉన్న ఉత్తరాంధ్రపైన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి? కాకినాడ పోర్టును, సెజ్ ను విజయసాయిరెడ్డికి ధారాదత్తం చేశారని, విశాఖ మన్యంలో ల్యాటరైట్, బాక్సైట్ తవ్వకాలు చేసుకునేందుకు వైవీ సుబ్బారెడ్డికి అడ్డగోలు అనుమతులిచ్చింది నిజం కాదా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కనీసం తట్టెడు మట్టికూడా వేయని మాట నిజం కాదా? అని కూన రవికుమార్ ప్రశ్నించారు.
కూన ప్రశ్నకు సాయిరెడ్డి కౌంటర్
ఉత్తరాంధ్రపై రెడ్ల పెత్తనమేంటని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేసిన ప్రశ్నకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ఉత్తరాంధ్ర తెలుగు దొంగల పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనే వాడి సామ్రాజ్యమా? అని సాయిరెడ్డి ప్రశ్నంచారు. ఇతగాడు ఉత్తరాంధ్రకు చంద్రం నియమించిన సామంత దొంగా? ఉత్తరాంధ్రలో స్థిరపడాలంటే ఈ సామంత దొంగ దగ్గర పాసుపోర్టు తీసుకోవాలా? అంటూ కూన రవికుమార్ పై సాయిరెడ్డి ట్వీట్ లో రెచ్చిపోయారు. దీంతో రెడ్ల పెత్తనాన్ని ప్రశ్నించిన బీసీ మాజీ ఎమ్మెల్యేపై రెడ్డి సామాజిక వర్గ ఎంపీ ఎదురుదాడి మొదలైంది.
కమ్మ నేతల్ని టార్గెట్ చేసిన సాయిరెడ్డి ?
విజయసాయిరెడ్డి అంతటితో ఊరుకోలేదు. నిన్న కూన రవికుమార్ పై ఎదురుదాడి చేస్తూ ఆ ట్వీట్ చేసిన సాయిరెడ్డి ఇవాళ కమ్మ సామాజిక వర్గ నేతల్ని, వ్యాపారవేత్తల్ని టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్రలో చంద్రంకు ఏం పని? వేల ఎకరాల ఆసామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? వంగవీటి రంగా హంతకుడు వెలగపూడి విశాఖ ఎందుకొచ్చాడో చెప్పు. అని కూన రవికుమార్ నే ప్రశ్నించారు. డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు? వీళ్లంతా మిడతల దండులా వచ్చి విశాఖలో 80% భూములు ఆక్రమిస్తే 'కమ్మ'గా ఉందర్రా కూనా? అంటూ సాయిరెడ్డి రెచ్చిపోయారు. తద్వారా కమ్మ నేతలు వచ్చి ఉత్తరాంధ్రను ఆక్రమిస్తే ఫర్వాలేదు కానీ రెడ్లు రాకూడదా అని సాయిరెడ్డి ప్రశ్నించినట్లయింది.