పవన్ కళ్యాణ్ తర్వాత జగన్: అతి సమీపంలో ఉంటూ తలొంచలేదు, అమోఘం
ఫిడెల్ క్యాస్ట్రో మృతి పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. శనివారం జనసేన అధినేత పవన్ కూడా ట్వీట్ ద్వారా సంఘీభావం తెలిపారు.
విజయవాడ: ఫిడెల్ క్యాస్ట్రో మృతి పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అమెరికాకు అతి సమీపంగా ఉంటూ, అగ్రరాజ్యానికి కించిత్ తల వంచని ధీశాలి క్యాస్ట్రో అని ప్రశంసించారు.
క్యూబా చిన్న దేశమే అయినప్పటికీ ఎవరికీ గులాం కాకుండా ప్రపంచంలో నిలబడిన తీరు అమోఘమన్నారు. తన పట్టుదల, నిబద్ధతతో క్యూబాను, క్యూబా దేశీయులను నడిపించిన మహానేత ఫిడెల్ క్యాస్ట్రో అన్నారు. 50 ఏళ్ల పాటు క్యాస్ట్రో పాలనలో క్యూబా పలు విజయాలు సాధించిందన్నారు. అద్భుతమైన పోరాట స్ఫూర్తి, మొక్కవోని నిబద్ధతతో క్యూబాను నడిపించిన మహానేత క్యాస్ట్రో అన్నారు.
కాగా, శనివారం నాడు పవన్ కళ్యాణ్ కూడా ఫిడెల్ క్యాస్ట్రో మృతికి సంతాపం తెలిపారు. చే గువేరా లాంటి విప్లవ వీరులను తయారు చేసిన విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన క్యాస్ట్రోకు జనసేన పార్టీ సెల్యూట్ చేస్తోందన్నారు. ఆయన నాయకత్వంలో క్యూబా అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేసిందన్నారు.
విప్లవానికి మారుపేరు: మధు
విప్లవానికి మారు పేరు కాస్ట్రో అని సీపీఎం నేత పి మధు అన్నారు. శనివారం రాత్రి రాఘవయ్య పార్కు ఎదురుగా ఉన్న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో కాస్ట్రో సంతాప సభ జరిగింది. ముందుగా ఆయనకు నివాళులర్పిస్తూ విజ్ఞాన కేంద్రం వెలుపల కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం కాస్ట్రో చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నేతలు నివాళులర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం మధు మాట్లాడారు. కాస్ట్రోమృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటన్నారు. క్యూబా చిన్న దేశమైనప్పటికీ సామ్రాజ్యవాదాన్ని దీటుగా ఎదుర్కొన్నారన్నారు.