బాబు వస్తే సంతోషించా!ఎక్కడైనా ఓకే: రాజధానిపై జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఎపి అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ... చంద్రబాబు వచ్చారని, సింగపూర్ లాంటి రాజధానిని కడతారని చాలామందితో పాటు తాను సంతోషించానని జగన్ సభలో అన్నారు. సింగపూర్ లాంటి రాజధాని చెబితో తామంతా ఆనందపడ్డామన్నారు.
రాజధాని అంటే కేవలం అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం కట్టడం మాత్రమే కాదన్నారు. రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ పెట్టినా తాను అభ్యంతర పెట్టనని కానీ, రాష్ట్రానికి మధ్యలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. రాజధాని కోసం 25 వేల నుండి 30 వేల ఎకరాల భూమి కావాలని, అంత భూమి ఎక్కడుందో తనకు మాత్రం తెలియదన్నారు.
రాజధాని ఎక్కడ కట్టినా.. ఇరవై అయిదు నుండి ముప్పై వేల ఎకరాలలో కట్టాలన్నారు. అలాంటప్పుడు నిజంగా సింగపూర్ లాంటి నగరం సాధ్యమవుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. అయితే ఆ కట్టబోయే రాజధానిలో పేదవాడిని, ప్రభుత్వ ఉద్యోగిని కూడా గుర్తుకు పెట్టుకోవాలన్నారు.
చంద్రబాబు తొలి సంతకం గురించి మాట్లాడి.. ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సంతకం పెడుతుంటే కోట్లాది మందితో పాటు తాను కూడా చూశానన్నారు. అన్నింటితో పాటు వృద్దాప్య పింఛన్ల పైన కూడా సంతకం పెడతారని తాను భావించానని చెప్పారు.
ఆదర్శ రైతులంతా కలెక్టర్ ద్వారా నియమితులైన వారే అన్నారు. ఇరవై నాలుగు వేల మంది ఆదర్శ రైతులను ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. ప్రభుత్వం కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిందని, కానీ అది అమలు కావడం లేదన్నారు. ఉచిత విద్యుత్ పైన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు.
హైదరాబాదులోని ఎపి విద్యార్థుల పరిస్థితి మరి దారుణంగా ఉందన్నారు. వారు తమ విద్యార్థులు కాదని తెలంగాణ రాష్ట్రం చెబుతోందన్నారు. ఆరోగ్యశ్రీని కూడా జగన్ ప్రస్తావించారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నిరుద్యోగులకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. దాని ఊసే లేకుండా పోయిందన్నారు. హామీల అమలు సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు కూడా పీకేస్తున్నారన్నారు.