కత్తికి విషం పూశారా? హత్యయత్నమే.. కానీ జగన్ ఆ క్షణంలో తిరగడంతో: నిందితుడు చెప్పిన షాకింగ్ విషయం!
అమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి హత్యాయత్నంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఒక్క వేటుతో జగన్ను చంపాలని చూశారని, భగవంతుడి దయ వల్ల, ప్రజల దీవెనల వల్ల తప్పించుకున్నారని ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అన్నారు. కత్తికి విషం పూశారా అని వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
చదవండి: విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ జగన్పై కత్తితో దాడి: రక్తంతో తడిసిన షర్ట్
ఆ పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. జగన్పై దాడి విషయంలో పూర్వపరాలన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఈ దుర్మార్గపు చర్యలను ప్రతి పార్టీ ఖండించాలన్నారు. సెల్ఫీ తీసుకుంటానని చెప్పి వచ్చి కత్తితో పొడవడం.. ఆ కత్తి ఏమిటి, కత్తికి విషపూరిత పదార్థాలు పూశారా తేలాలని అన్నారు.
విషం పూశారా, ఎవరైనా ప్రోత్సహించారా?
కత్తికి విష పదార్థాలు పూశారా అనే తెలుసుకోవడంతో పాటు నిందితుడిని ఎవరైనా ప్రోత్సహించారా తేలాల్సి ఉందని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. అలాగే అతని మానసిక పరిస్థితి పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పారు. ఎవరు చేసినా ఇలాంటి దుర్మార్గపు చర్యలను అందరూ ఖండించాలన్నారు. భవిష్యత్తులో ఎవరి పైనా ఇలాంటి దాడులు జరగకుండా చూడాలన్నారు. కోడి పందాలకు వాడే కత్తి కావడంతో దానికి విషం లాంటివి ఉండొచ్చని భావించిన డాక్టర్లు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు.
జగన్ టీని పక్కన పెట్టి లేవగానే
జగన్పై విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడిపందాలకు వాడే కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. కోడి పందేల సమయంలో పందెం కోళ్ల కాళ్లకు కట్టే కత్తితో అతను జగన్ ఎడమ భుజంపై దాడి చేశాడు. అతనిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అదుపులోకి తీసుకొని, విచారించింది. జగన్ విజయనగరం జిల్లాలో గురువారం పాదయాత్ర ముగించుకున్న తర్వాత శుక్రవారం కోర్టుకు హాజరు కావడం కోసం గురువారం మధ్యాహ్నం గం.12.20 నిమమిషాలకు హైదరాబాద్కు వెళ్లేందుకని విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీఐపీ లాంజ్లో పార్టీకి నేతలతో వేచి ఉన్నారు. పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్కు చెందిన ఇద్దరు వెయిటర్స్ సురేష్, రమ వారికి టీ, మంచినీళ్ల బాటిల్స్ తీసుకు ఇచ్చారు. వారితో శ్రీనివాస్ రావు కూడా వచ్చాడు. తనకు టీ వద్దని కాఫీ కావాలని జగన్ చెప్పారు. దీంతో వెయిటర్ రమ కాఫీ తీసుకు వచ్చింది. ఆ తర్వాత విమానానికి సమయమైందని సీఐఎస్ఎఫ్ బలగాలు చెప్పడంతో తాగుతున్న కాఫీని పక్కనపెట్టి జగన్ లేచే ప్రయత్నం చేశారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 12.30 గంటలవుతుంది.
160 సీట్లు గెలుస్తారని చెప్పి పొడిచాడు
రెస్టారెంట్ వెయిటర్ జానపల్లి శ్రీనివాసరావు జగన్ వద్దకు వచ్చాడు. సార్.. మీరు సూపర్, ఈసారి మీరు తప్పకుండా 160 సీట్లు గెలుస్తారు, మీరే కచ్చింగా గెలుస్తారని జగన్తో చెప్పాడు. జగన్ ఆయనను చిరునవ్వుతో పలకరించారు. అంతలోనే శ్రీనివాస రావు.. అన్నా మీతో సెల్ఫీ దిగాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాని చెప్పాడు. దీంతో జగన్ దగ్గరకు రమ్మని చెప్పాడు. అప్పుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు.
ఆ సమయంలో జగన్ కాస్త పక్కకు తప్పుకోవడంతో ముప్పు తప్పింది
నిందితుడు శ్రీనివాస రావు సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. అదే సమయంలో కత్తితో దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు. జగన్ సెల్ఫీ కోసం కాస్త పక్కకు జరిగాడని, దీంతో ఆ కత్తి ఎడమ భుజానికి తగిలిందని, లేదంటే మెడకు తగిలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ పక్కకు జరగడానికి మరో కారణం కూడా వినిపిస్తోంది. సెల్ఫీ దిగేందుకు శ్రీనివాస రావు... జగన్ వద్దకు వచ్చిన సమయంలో శ్రీకాళహస్తి పార్టీ కో ఆర్డినేటర్ మధుసూదన రెడ్డితో పాటు కొందరు నేతలు వైసీపీ అధినేతను కలిసేందుకు వచ్చారు. ఆ సమయంలో జగన్ ఓసారి వారిని పలకరించేందుకు ఎడమ చేతి వైపు తిరిగారని, అదే సమయంలో శ్రీనివాస రావు దాడి చేశాడని, మెడపై దాడి చేసే ప్రయత్నం చేయగా, జగన్ తిరగడంతో గురి తప్పి భుజంలోకి దూసుకెళ్లిందని చెబుతున్నారు. ఈ ఘటన సరిగ్గా గం.12.38 జరిగిందని తెలుస్తోంది.
అరెస్ట్ చేయండి అంటూ నినాదాలు
జగన్ పైన దాడి చేసిన అనంతరం శ్రీనివాస రావు తనను అరెస్టు చేయండి.. తనను అరెస్టు చేయండి అని అరిచారు. వైసీపీ నాయకులు కొడతారని అతను అలా అరిచారని తెలుస్తోంది. ఈ ఘటన తెలియగానే విమానాశ్రయ వైద్య సిబ్బంది హుటాహుటిన వీఐపీ లాంజ్లోకి వచ్చి జగన్కు ప్రాథమిక చికిత్స అందించారు. ఇక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుదామని నేతలు చెప్పారు. కానీ జగన్ ఏం పర్లేదంటూ హైదరాబాద్ వచ్చారు. విమానం బయలుదేరేందుకు సమయం దగ్గరపడిందని, కాబట్టి వెళ్లాలని చెప్పారు. ఎయిర్ పోర్టు వైద్యురాలు లలితా స్వాతి తన సిబ్బందితో జగన్కు ప్రాథమిక చికిత్స చేశారు.
ఈ అవకాశం కోసం వేచి చూస్తున్నా
జగన్పై దాడి చేసిన శ్రీనివాసరావును ఘటన జరగ్గానే కేంద్ర భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. సిబ్బంది తీసుకెళ్తున్నప్పుడు అతను కొన్ని విషయాలు మాట్లాడినట్టుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ అవకాశం కోసం వేచి చూస్తున్నానని, అది ఇప్పుడు దొరికిందని అతడు అన్నాడని తెలుస్తోంది. తనను అరెస్టు చేయాలని, వదలొద్దని కూడా పోలీసులతో చెప్పాడట. నిందితుడు ఉపయోగించిన కత్తికి విషాన్ని పూసి ఉండొచ్చని విమానాశ్రయం లోపల వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు.